*నలంద - చరిత్ర మరచిన విశ్వవిద్యాలయం -1*
🏛️
రచన - పుట్టగంటి గోపీకృష్ణ
పన్నెండవ శతాబ్దం ముగింపు రోజులు-
పాటలీపుత్రం నుండి గయ వెళ్ళే మార్గము లో కొద్దిగా పక్కకు తొలగివుంటుంది-
*'నలంద'*
సిద్ధార్థుడు తిరిగిన నేల. ఏ బోధివృక్షం కింద సిద్ధార్థుడు బుద్ధునిగా మారాడో... ఆ బోధివృక్షానికి కూతవేటు దూరంలోని నేల.
చంద్రగుప్తమౌర్యుడు పరిపాలించిన నేల.
అశోకుని వీరత్వానికీ, శాంతికాముకతకు... సాక్షీభూతంగా నిలిచిన నేల.
భారతదేశానికి విద్యా కేంద్రంగా విలసిల్లిన తక్షశిల పతనం తరువాత... అంతటి స్థాయిలో విద్యాకేంద్రంగా ఎదిగిన నేల.
గుప్తరాజుల ప్రోత్సాహంతో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నలంద విశ్వవిద్యాలయం స్థాపింపబడిన నేల. ప్రతి అయిదు సంవత్సరాలకు, 'సర్వస్వదానం' చేసే హర్షవర్ధనుడు ఇచ్చిన నూరు గ్రామాల దానంతో పరిఢవిల్లిన విశ్వవిద్యాలయం ఉన్న నేల.
ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం గతించింది.
స్వర్ణయుగం గుప్తులతోనే అంతరించింది.
వచ్చే దానాలు హర్షవర్ధనుడి అనంతరం ఆగిపోయాయి.
మహాసామ్రాజ్యాలు అంతరించి, చిన్న చిన్న రాజ్యాలు వెలిశాయి. అయినా నలంద ప్రాభవం తగ్గలేదు.
ప్రపంచవ్యాప్తంగా అనేక వేలమంది విద్యార్థులనూ, వందలకొలదీ ఆచార్యులనూ ఆకర్షిస్తున్న విశ్వవిద్యాలయం విజ్ఞాన నిలయంగా విలసిల్లుతూనేవుంది.
లక్షలాది పుస్తకాలున్న దాని గ్రంథాలయం విజ్ఞాన ప్రేమికులను ఆకర్షిస్తూనేవుంది.
అలాంటి విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఒక పెనుముప్పుకు గురికాబోతోంది.
అటు విదేశీ దండయాత్రలు భారతదేశానికి కొత్తకాదు. కానీ ఎదిరించటానికి దేశానికి బలమైన చక్రవర్తి లేని ప్రస్తుత కాలం దోపిడీదారులకు అనువుగా మారింది.
ఎప్పుడో నాలుగువందల సంవత్సరాల క్రితమే మహమ్మద్-బిన్-కాసిమ్ దండెత్తి వచ్చాడు. అయితే అతని దండయాత్ర నలందుకు వేల మైళ్ళ దూరంలోనే ఆగిపోయింది.
వంద సంవత్సరాల క్రితం పదిహేడుసార్లు దండయాత్ర చేసిన మహమ్మద్ గజనీ... అనేక నగరాలు, దేవాలయాలు దోచుకుని ధ్వంసం చేసినా ఇక్కడివరకూ రాలేదు.
ఇరవై సంవత్సరాలక్రితం ఇంద్రప్రస్థంవరకూ వచ్చిన మహ్మద్ ఘోరీ చూపుకూడా నలంద మీద పడలేదు. కానీ... ఇప్పుడు నలందమీదకి దాడికి రాబోతున్నవాడు వారందరినీ మించిన అతి క్రూరుడు, దుర్మార్గుడు.
దూసుకువస్తున్న ముప్పును పాటలీపుత్ర సైన్యం ఎదిరించలేకపోయిందేమోకానీ... విశ్వ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులందరూ కలిసి ఎదిరించారు.
అప్పుడు జరిగిందే ఈ కథ...
📖
మధ్యభారతంలోని ఒక ప్రదేశం.
ఎండ చిరచిర్లాడుతోంది.
ఏభైవేలమంది మనుషులు ఒకచోట చేరి కూడా మౌనంగా నిలబడివుండటం సాధ్యమా? అది ఖిల్జీ సైన్యం అయితే సాధ్యమే!
భయం అంటే ఏమిటో తెలిసిన సైన్యానికి క్రమశిక్షణ దానంతట అదే అలవడుతుంది.
క్రమశిక్షణ లేనివాడికి సైన్యంలో చోటు ఉండదు. ఖిల్జీ సైన్యంలో అయితే ప్రాణాలే ఉండవు. మైదానాన్నంతా ఆక్రమించుకున్న వందలాది గుడారాలు పాలు లాగా తెల్లగా మెరుస్తున్నాయి.
దూరంగా చెట్లనీడలో వంద ఏనుగులు, వెయ్యి గుర్రాలు సేదతీరుతున్నాయి. అప్పుడప్పుడూ గుర్రాల సకిలింపులుతప్ప దారుణ నిశ్శబ్దం అక్కడ ఆవహించివుంది.
అందరి ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ దూరంగా ఒక ఏనుగు వస్తూ కనిపించింది. దానిమీద ఉన్న అంబారీని చూడగానే వస్తోంది ఎవరో చెప్పకనే అర్థమైంది అందరికీ.
పైన కూర్చున్న వ్యక్తి కిందకు దిగటానికి వీలుగా కిందకి వంగిన ఏనుగు దాని
ఎడమ కాలు ముందుకు చాచింది. దానిమీద తన కాలువేసి చెంగున కిందకు దిగాడు ఖిల్జీ.
అతను ఏనుగుమీద నుండి కిందకు దిగాడో లేదో ఒక ఆసనం ఆ మైదానంలో వేయబడింది. ఆ ఆసనానికి ఎండ తగలకుండా చత్రాలు ఏర్పరచబడ్డాయి.
అతని ఆసనం పక్కన వచ్చి నిలబడ్డాడు ఖుర్రంఖాన్. అతను ఖిల్జీకి నమ్మినబంటు. ఖిల్జీ ఎవరినైనా నమ్ముతాడంటే అది ఇతన్నే!
ఖిల్జీ గాంధార దేశానికి చెందినవాడు. పెద్దగా చదువులేదు. బ్రతకటానికి సరిపడా తెంపరితన మాత్రం చిన్నప్పటినుండే ఉంది.
అతనికి తన వీరత్వాన్ని ప్రదర్శించటానికి మంచి రంగస్థలం కావాలనిపించింది. అలాంటి ప్రదేశం తూర్పుదిక్కున భారత దేశ రూపంలో కనిపించింది. అప్పుడప్పుడే తురుష్కులు భారతదేశ సంపద రుచి మరుగుతున్నారు. మరికొందరు ఎకాఎకీ సామ్రాజ్యాలే స్థాపించాలని చూస్తున్నారు. వారిని అనుసరించి భారతదేశంలో కుదురుకున్నాడు ఖిల్జీ.
వచ్చింది నాలుగేళ్ళ క్రితమే అయినా ఇప్పటికే నాలుగు సంస్థానాలదగ్గర పనిచేశాడు.
చివరకు ఔధ్ ప్రాంతపు నవాబు మాలిక్ హుసమ్ దగ్గర పనిచేస్తుండగా ఖిల్జీ కి అనుకోకుండా అదృష్టం కలిసివచ్చింది. నవాబు బలహీనపడిన ఒకానొక దురదృష్ట క్షణంలో అతని ధనంతో తయారుచేసిన సైన్యాన్ని తీసుకుని పరారయ్యాడు ఖిల్జీ.
తరువాత ఆలోచించుకుని చూస్తే తనదగ్గర ఉన్న సైన్యం సామాన్యమైనదికాదని అతనికి అర్థమైంది. అనేక సంస్థానాలుగా, రాజ్యాలుగా వేరుపడి బలహీనపడిన భారతదేశంలో చాలామంది రాజులవద్ద ఉన్న సైన్యానికంటే తనదగ్గర ఉన్న సైన్యం ఘనమైనదని అతనికి తెలిసింది. నెమ్మదిగా ఇంకొక విషయం కూడా తెలిసింది.
ఏభైవేలమంది మనుషులను, నూరు ఏనుగులను, వెయ్యి గుర్రాలను మేపటం అంటే మాటలు కాదు. మనుషులు ఉన్నారుకాబట్టి జంతువుల మేత వాళ్ళే తెస్తారు. మరి మనుషుల సంగతో?... దోచుకుంటున్న సంపద సైన్యానికే సరిపోతోంది. వాళ్ళకి జీతాలు ఇవ్వటం ఇబ్బంది అవుతోంది. ఖిల్జీ కి ఇప్పుడు అర్థమవుతోంది. ఎంతో పెద్ద పెద్ద రాజులు కూడా ఇంత సైన్యాన్ని ఎందుకు పోషించ లేరో!... వాళ్ళకి మరి ప్రజాసంక్షేమం అనే బాధ్యత ఒకటి ఉంటుంది కదా!
ఈలోపు జీతాలు అందక సైన్యంలో ఒకరొకరు పారిపోవటం మొదలైంది. దానిని అరికట్టటానికి ఒక కొత్త పద్ధతి కనిపెట్టాడు ఖిల్జీ. అయిదుగురు సైనికులు ఒక గణం. వారికి ఒక నాయకుడు. అలాంటి అయిదు గణాలకు ఒక దళపతి.
అలాంటి ఐదుగురు దళపతులకు ఒక సుబేదార్. సైనికులు ఒకరికొకరు బాధ్యులు గా ఉండాలి. వారిలో ఎవరు తప్పించుకు పోయినా మిగిలిన నలుగురికీ శిక్ష విధించబడుతుంది.
ఒకవేళ అయిదుగురూ తప్పించుకుపోతే నాయకుడికి శిక్ష తప్పదు. ఈలోపు ఖుర్రం ఖాన్ నలుగురు సైనికులను ఖిల్జీ ఎదుట ప్రవేశపెట్టాడు. "వీరి గణంలోని సైనికుడే తప్పించుకుపోయింది" ఖిల్జీకి చెప్పాడతను.
"...శిక్ష అమలుచేయండి" మరో మాటకు తావులేకుండా చెప్పాడు ఖిల్జీ.
ఆ నలుగురినీ వెల్లకిలా పడుకోపెట్టారు. వారు కదలటానికి వీలులేకుండా మోకులతో బంధించి నేలకు కొట్టిన రాటలకు బిగించారు.
ఖుర్రంఖాన్ సైగతో ఖిల్జీ ఎక్కిన ఏనుగు ముందడుగు వేసింది. దాని పైన కూర్చున్న మావటి దానిని కిందపడుకున్న నలుగురు సైనికులమీదకి నడుపుతున్నాడు.
నలుగురు సైనికులు చేస్తున్న ఆర్తనాదాల తో, హాహాకారాలతో అక్కడ దిక్కులు పిక్కటిల్లుతున్నాయి.
మొదటి సైనికుడిదగ్గరకి వచ్చి కాలు ఎత్తిన ఆ మహాకాయం జంతువైనా, విచక్షణను ప్రదర్శిస్తూ ఎత్తిన కాలు దించటంలో ఒక్క క్షణం ఆలస్యం చేసింది.
ఆ ఆలస్యం కూడా భరించలేనట్లు ఖిల్జీ అసహనం ప్రదర్శించాడు.
మావటి చేతిలోని ఇనుప అంకుశం కదిలింది. దానితో ఏనుగు తన విచక్షణని పక్కన పెట్టి కాలు కిందకు దింపింది.
'కటకట పటపట...' శబ్దాలు చేస్తూ ఛిన్నాభిన్నమైపోయింది మొదటి సైనికుడి శరీరం.
మిగిలిన ముగ్గురి అరుపులూ మరింత ఎక్కువయ్యాయి.
రెండవ కాలు ఎత్తింది ఏనుగు పని పూర్తి చెయ్యటానికి.
అసలు అక్కడ జరుగుతున్నది ఒక విషయమే కాదన్నట్లు ఖిల్జీ తన ముఖం ఖుర్రంఖాన్ వైపు తిప్పి, "ఈ సైన్యాన్ని మేపుతూ మనం కాస్త మిగుల్చుకోవాలంటే దోచుకోవటానికి మరింత ధనవంతమైన రాజ్యాలు కావాలి. అవి ఎక్కడ ఉన్నాయో కనుక్కోమన్నాను. ఆ విషయం ఎంత వరకు వచ్చింది?" అని అడిగాడు.
"కనుక్కున్నాను జహాపనా... హిమాలయాలు జీవనదులకు పుట్టినిళ్ళు. ఆ నదుల పరీవాహక ప్రాంతం మహా సారవంతమైన భూములకు నిలయం. అక్కడ ఉన్న అనేక రాజ్యాలలో పాటలీ పుత్రం అత్యంత ఐశ్వర్యవంతమైన రాజ్యం. అదొక్కటే కాదు... దానికి వెళ్ళే దారిలో ఉన్న చిన్నాచితకా సంపన్న రాజ్యాలకు లెక్కేలేదు. వారెవరికీ మన సైన్యాన్ని ఎదిరించగల సామర్థ్యం లేదు”
ఏనుగు తన పని పూర్తిచేసినట్లుంది. మనుషుల అరుపులు ఆగిపోయాయి. ఎర్రటి రక్తం అంటిన కాళ్ళతో అది తిరిగి తన స్థానానికి వచ్చి నిలబడింది.
"మన సైనికులకు చెప్పండి. అతిత్వరలో దాడులు ప్రారంభిద్దాం. అప్పుడు అందరి ఆకలి తీరేటంత సంపదలు చేకూరతాయి. ఆ తరువాత ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళవచ్చు"
"ఈ శిక్షా పద్ధతి ప్రవేశపెట్టాక సైనికుల్లో భయం పతాకస్థాయికి చేరింది జహాపనా...."
"అదే మన ఆస్తి ఖుర్రంఖాన్! ఏది పోయినా పరవాలేదు. మనమీద భయం మాత్రం పోకూడదు" అంటూ తన ఏనుగువైపు నడిచాడు ఖిల్జీ
🔥
*సశేషం*
꧁☆꧂
•┉┅━
*నలంద - చరిత్ర మరచిన విశ్వవిద్యాలయం - 3*
రచన - పుట్టగంటి గోపీకృష్ణ
ఇక్తియారుద్దీన్ మొహమ్మద్ బిన్ బఖియార్ ఖిల్జీ.
ఖిల్జీకి బాల్యం తెలియదు. భయం అంటే తెలియదు. ఎడతెగని యుద్ధాల్లో మునిగి తేలే సంచార జాతులలో సహజంగా జరిగినట్లే... అతను చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. హద్దు, అదుపూ లేని జీవితం విశృంఖలత్వాన్ని నేర్పింది.
సైనిక విద్యలు తప్ప అతనికి మరొక జ్ఞానం లేదు. నిరక్షరాస్యతా, రక్షణలేని జీవితం, లక్ష్యం లేని బ్రతుకూ...అతన్ని మొండివాణ్ణి చేస్తే, పుట్టుకతో అబ్బిన శారీరక దృఢత్వం నిర్భయుడ్ని చేసింది. ఆపద ఎటునుండి వస్తుందో తెలియని అభద్రతాభావం మతం మీద ఉండవలసిన విశ్వాసాన్ని మూఢ విశ్వాసంగా మార్చింది. తన మతంమీద విశ్వాసం ఉండటంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ వేరే మతాలవారిని ద్వేషించటం వేరు. ఖిల్జీ లో ఉన్న ఈ లక్ష ణమే అతన్ని క్రూరుడిగా, నియంతగా మార్చింది.
ప్రస్తుతం అతను తన సేనతో 'గంధిని' అనే నగర పొలిమేరల్లో విడిదిచేసి ఉన్నాడు. విశాల సేనావాహిని పదఘట్టనకు లేచిన ధూళితో పరిసరాలన్నీ మసకమసకగా కనిపిస్తున్నాయి.
తన వ్యక్తిగత అభిజాత్యం కోసం రాజ్య ప్రజల ప్రాణాలను పణంగా పెట్టటం అనవసరం అని భావించిన గంధిని ప్రభువు చరకమిత్రుడు ఖిల్జీతో సంధికి ప్రయత్నించాడు. అందుకు ఖిల్జీ కూడా అంగీకరించాడు. ఐతే సంధి ఒడంబడికలు ఇంకా నిర్ణయింపబడలేదు.
ఈలోపు ఖిల్జీని తృప్తిపరచటానికి మృగయా వినోదం ఏర్పాటు చేశాడు చరకమిత్రుడు. మనిషిని చంపటంలో ఉండే ఆనందం ఖిల్జీకి తెలుసు. కానీ, మనిషికంటే ఎన్నోరెట్లు బలవంతులైన పులులు, సింహాల గురించి అతను విని వుండటమే కానీ... స్వేచ్ఛా జీవులుగా వాటిని ఎప్పుడూ చూసింది లేదు. ప్రస్తుతం చరకమిత్రుని సారథ్యంలో అందరూ రాజ్య పాలిమేరల్లో ఉన్న దట్టమైన అడవిలోకి ప్రవేశించారు.
ఏనుగుమీద ఏర్పాటు చేసిన అంబారీలో ఖిల్జీ కూర్చుంటే, అతని వెనుక ఖుర్రంఖాన్, మరో ఇద్దరు అంగరక్షకులు ఉన్నారు. అవసరమైనప్పుడు అందించటానికి వీలుగా రకరకాల ఆయుథాలు వారికి అందుబాటులో ఉన్నాయి. అలాంటిదే మరో ఏనుగు మీద చరకమిత్రుడు ఆసీనుడయ్యాడు.
క్రమంగా వారు దట్టమైన అడవిలోకి ప్రవేశించారు.
వేట అన్నది మనిషికి ఒక కళ అయితే మృగానికి జీవన్మరణ సమస్య. పోరాడకుండా చనిపోవటానికి ఏ జీవీ ఒప్పుకోదు.
అన్నిటిలోకీ ఖిల్జీకి ఆశ్చర్యం కలిగించిన విషయం, సైనికుల కాళ్ళ దగ్గర కుక్కల్లాగా తిరుగుతున్న చిరుతలు. అవి కూడా వేటలో మనుషులకు సహకరిస్తాయని తెలిసిన తరువాత ఖిల్జీ ఉత్సుకత మరింత ఎక్కువైంది. వేట మొదలు అయిందన్న సైగ అందుకున్న మావటీలు ఏనుగులను ముందుకు నడిపారు.
ముందు చిన్న చిన్న జంతువులు ఎదురయ్యాయి. జింకలు, దుప్పులు, అడవిపందులు వంటి చిన్న జంతువులు కనపడితే చిరుతలను వాటిమీదకు ఉసికొల్పుతున్నారు.
చిరుతలు లాఘవంగా ఆ జంతువులను మనుషులున్న వైపుకు తరుముకు వస్తున్నాయి. దగ్గరకి వచ్చిన జంతువుల్ని ఎత్తుగా సురక్షితంగా ఉన్న అంబారీ నుండి గురి తప్పకుండా కొడుతున్నాడు ఖిల్జీ.
ఉన్నకొద్దీ అరణ్యం దట్టంగా మారింది. ప్రయాణం కష్టతరం అయింది. హఠాత్తుగా దూరంగా తప్పెట్లు మోగాయి.
ఏనుగులు ఉన్న చోటే ఆగిపోయాయి. నిలబడ్డ చోటే నిలకడలేకుండా కదులుతు న్నాయి. ఒక్కసారిగా పక్షులు చేస్తున్న శబ్దాలు ఆగిపోయాయి. చెట్లమీద కోతులు కిచకిచమంటూ దూరంగా ఎగిరి వెళ్ళిపోతున్నాయి..
"అదిగో! పులి!..." అన్న అరుపుల మధ్య పొదల్లో నుండి ఎగిరి దూకింది పెద్దపులి. ఖిల్జీ విడిచిన బాణం ముందుగా దాని కంఠం నుండి దూసుకుపోయింది. అదే సమయంలో ఇంకో రెండు మూడు బాణాలు కూడా దాని శరీరంలో లోతుగా నాటుకున్నాయి. కాసేపు గిలగిలా కొట్టుకున్న పులిలో చైతన్యం ఆగిపోయింది.
మావటి సూచనతో ఏనుగు కింద కూర్చుంది. దానిమీద నుండి కిందకు దిగాడు ఖిల్జీ. నెమ్మదిగా నడుచుకుంటూ చనిపోయిన పులి దగ్గరకు వెళ్ళసాగాడు. దానికి దగ్గరగా వెళుతున్న కొద్దీ వికారపు వాసన వస్తోంది. ముక్కు మూసుకుని దాని మీదకు వంగి దగ్గరగా పరిశీలించాడు.
అంత పెద్ద క్రతువు ఇంత తేలిగ్గా తన చేతుల్లో చనిపోవటం ఖిల్జీకి ఆశ్చర్యం
కలిగించింది. అతని ఆత్మవిశ్వాసం భారీగా పెరిగింది.
ఇంతలో అతనికి దూరంగా మరో జంతువు కనపడినట్లుంది. తిరిగి తప్పెట్లమోత వినిపించసాగింది.
పరుగు పరుగున వెళ్ళి తన ఏనుగు పైకి ఎక్కాడు ఖిల్జీ.
అతనికి ఈ ఆట అమిత ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా మృగరాజని పిలిచేది ఆ ఒక్క జంతువునే!
సింహాలు విచిత్రమైన జంతువులు. సాధ్యమైనంతవరకు ఎవరితోనూ కలవటానికి ఇష్టపడవు.
మందలుగా నివసించే అవి ఎంత క్రూర
మైనవో, అంత బద్దకపువి కూడా! రోజులో ఎక్కువ భాగం నిద్రపోతూ గడిపేస్తాయి ఈ జంతువులు.
ఒక్కొక్క మందలో పది, పదిహేను జంతువులు ఉన్నా ఎదిగిన మగసింహం మాత్రం మందకి ఒకటే ఉంటుంది.
పుట్టిన పిల్లల్లోని ఆడ జంతువులను మందలో కలుపుకోవటానికి ఇష్టపడే మగ సింహం, మగపిల్లలను మాత్రం యుక్త వయసు రాగానే మంద నుండి బయటకు తరిమివేస్తుంది. మూడేళ్ళ క్రితం అలా బయటపడింది ఒక మగసింహం.
తనదైన క్షేత్రం కోసం బయలుదేరిన అది గమ్యం చేరకముందే తనదైన తోడు దక్కించుకుంది. దొరికిన తోడుతో స్వంత క్షేత్రాన్ని ఏర్పాటుచేసుకుంది.
రెండేళ్ళు గడిచిపోయాయి. రెండు విడతలలో రెండుసార్లు దానికి సంతానం కూడా కలిగింది. ఇప్పుడు మగసింహం తొమ్మిదడుగుల బారుతో, రెండువందల వీశెల పైచిలుకు బరువుతో, బంగారు రంగులో మెరుస్తున్న జూలుతో ఇతర మగ సింహాలకు ఈర్ష్య కలిగేలా ఎదిగింది.
మామూలుగా రోజుకు ఇరవైగంటలు నిద్రపోతూనే గడుపుతాయి సింహాలు. వేట పని సివంగులే చూసుకుంటాయి. మగ సింహం చేసే పనేదైనా ఉందంటే అది తన క్షేత్రాన్ని పరి రక్షించుకోవటమే! ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే మగసింహాలను అది తన పరిధిలోకి రావటానికి అంగీకరించదు. దానికిగానూ అది తనదైన క్షేత్రం చుట్టూ మూత్రవిసర్జన చేస్తుంది. దాని మూత్రం నుండి వెలువడే ప్రత్యేకమైన, ఘాటైన వాసన మిగిలిన సింహాలకు ఒక హెచ్చరికలా పనిచేస్తుంది.
ఒకవేళ ఏదైనా మగసింహం ఈ హెచ్చరికలు పట్టించుకోకుండా పరిధిని అతిక్రమిస్తే దానిని తరిమికొట్టటమే ఈ సింహం పని, ఈ రోజు కూడా అది ఆ పనిమీదే బయలుదేరింది.
బద్దకంగా నడుస్తున్నట్లు నడుస్తూ అది తన పరిధిలోని చెట్లమీద కొద్దికొద్దిగా మూత్రం పోస్తూ ముందుకుపోతోంది.
హఠాత్తుగా దానికి మనుషుల కలకలం వినిపించింది. వెంటనే ప్రతిస్పందించిన ఆ సింహం వెనక్కితగ్గింది. తన పరిసరాలు పరిశీలించుకుంది. ముందుగా తనకు ఏ విధమైన ప్రమాదమూ లేదని అది నిర్ధారించుకుంది. తరువాత తన మంద వద్దకు ఆ మనుషులు వెళ్ళే వీలులేదని కూడా అది అర్థంచేసుకుంది. అప్పుడు అది తన ఎదురుగా జరుగుతున్న సంఘటనలను చూడసాగింది.
తన తోటి జంతువులను చంపుతూ వినోదిస్తున్న మనుషులను అది అసహ్యం గా చూసింది. అక్కడ ఏనుగు అంబారీ మీద కూర్చున్న వ్యక్తి ప్రముఖంగా కనిపిస్తున్నాడు. అతని పక్కన ఉన్న మరొక వ్యక్తి సూచనలను నవ్వుతూ పాటిస్తున్నాడు.
ప్రపంచంలోని అత్యంత క్రూరమైన జీవులను ప్రత్యక్షంగా చూస్తోంది అది.
పట్టణానికి కొద్ది దూరంగా, ఒదిగివున్నట్లు ఒక పక్కగా ఉన్న చిన్న గుట్టమీద కట్టబడి వుంది 'గంధిని' కోట. కోట పై భాగాన మిగిలిన భవనాలన్నిటికంటే ఎత్తుగా ఉంది రాజమందిరం.
ఖిల్జీ, ఖుర్రంఖాన్, మరికొంతమంది ముఖ్యులు చరకమిత్రుడి ఆహ్వానం మీద అతని మందిరంలోనే బస చేసి వున్నారు.
ఉదయాన్నే నిద్రలేచిన ఖిల్జీ మందిరపు గవాక్షం నుండి బయటకు చూస్తూ కూర్చున్నాడు. దిగువున గంధిని పట్టణం కనిపిస్తోంది. అది ఏదో కోల్పోయినట్లు దిగులుగా ఉంది.
కోట రెండవవైపున కంటిచూపు ఆనినంత దూరం పచ్చని పొలాలు వ్యాపించి ఉన్నాయి.
ఆకుపచ్చ రంగులోనే ఇన్ని ఛాయలు ఉన్నాయా అన్నట్లు వివిధరకాల పొలాలు కంటికి ఇంపుగా ఉన్నాయి. ఖుర్రంఖాన్ కూడా వచ్చి అతని ఎదురుగా నిలబడ్డాడు.
ఇంతలో, “గంధిని ప్రభువులు చరక మిత్రులవారు తమ దర్శనార్థం వస్తున్నారు..." అని ఒక భటుడు చెప్పి వెళ్ళాడు.
పదికి పైగా పెద్ద పెద్ద పేటికలు సేవకులు మోసుకువస్తుంటే... వారికి ముందు భాగాన నిలిచిన చరకమిత్రుడూ, అతని ముఖ్య అధికారులూ ఖిల్జీవద్దకు వచ్చారు.
సైనికులు పేటికలను వరుసగా కిందపెట్టి వాటి మూతలు తెరిచారు. వాటిల్లో మణి మాణిక్యాలు, రత్నఖచిత స్వర్ణాభరణా లతో మందిరానికే కొత్త వెలుగు వచ్చింది.
ఖిల్జీ తన కళ్ళలో మెరిసిన మెరుపును బయటకు కనిపించకుండా ఆపుకోవటానికి కష్టపడ్డాడు. తనకే ఇంత ఇస్తున్నాడంటే ఇతని ఖజానాలో ఇంకా ఎంత ఉంటుందో అన్న వంకర ఆలోచన అతని మదిలోకి ప్రవేశించింది. దానితో సంధికి ఒప్పుకోవటం వలన తను ఎంత కోల్పోతున్నాడో కూడా మనసులోనే లెక్కించుకున్నాడు. ఎలా అయినా సంధిని చెడగొట్టదలచాడు.
"ధనం సంగతి సరే! విడిగా ఉన్న సంపదల మాటేమిటి?" గోడలకున్న తైలవర్ణ చిత్రాల ను చూస్తూ అడిగాడు ఖిల్జీ.
"మీకు నచ్చినవి ఏవైనా ఉంటే చెప్పండి. వాటిని కూడా పంపిస్తాను" అన్నాడు చరకమిత్రుడు.
ఖిల్జీకి తైలవర్ణ చిత్రాలలో ఏదైనా నచ్చిందేమో అన్న ఉద్దేశంతో అతనలా అన్నాడు.
"ఈ పటం ఎవరిది?" తను చూస్తున్న పటాన్ని చూపించి అడిగాడు ఖిల్జీ.
"అది మా కుమార్తె కనకవల్లి పటం..."
"అయితే ఒక షరతుమీద ఈ సంధికి నేను ఒప్పుకుంటున్నాను..."
"ఏమిటి?" అన్నట్లు చూశాడు చరకమిత్రుడు.
"మీ కూతురు నాకు నచ్చింది. తనని నాకు అప్పచెప్పండి. వరకట్నంకింద మిగిలిన మీ ఖజానాని ఇవ్వండి...." అతనా మాటలు మాట్లాడుతుంటే వికృతంగా ఉండే ఖిల్జీ ముఖం మనసు లోని భావాలను బైటికి ప్రతిఫలిస్తూ మరింత వికృతంగా మారింది. ఎదుటి వ్యక్తిలోని అసహాయత్వాన్ని ఎగతాళి చేస్తున్నట్లు మొదలైన నవ్వు వికృత వికటాట్టహాసంగా మారింది.
అతనేదో హాస్యప్రసంగం చేసినట్లు ఖుర్రంఖాన్ కూడా ఖిల్జీ నవ్వుతో జతకట్టాడు.
పెల్లుబీకుతున్న కోపాన్ని ఇక ఎంత మాత్రమూ అణచిపెట్టలేని చరకమిత్రుడు, "ఛీ! నీచుడా...." అంటూ ఒరనుండి కత్తిని బయటకు లాగాడు.
ఖిల్జీ అతని చర్యను కనీసం గమనించనట్లు... కూర్చున్న చోటునుండి కదలకుండా వెనుకకు వాలి ఇంకా నవ్వుతూనే వున్నాడు.
చరక మిత్రుడు చేతిలోని కత్తిని పైకి ఎత్తాడు.
ఎప్పుడు వచ్చి నిలబడ్డాడో ఖుర్రంఖాన్... సరిగ్గా చరకమిత్రుని వెనుక నిలబడి ఉన్నాడు. తన చేతిలోని ఖడ్గాన్ని అత్యంత లాఘవంగా ఒక్క ఊపు ఊపాడు.
చరకమిత్రుని తల మొండెం నుండి వేరై దొర్లుకుంటూ మందిరం బయటకు పోయి పడింది. కొన్ని క్షణాలు అటూ ఇటూ ఊగిన మొండెం వెనక్కి విరుచుకుపడింది. జరిగింది అవగతమై మందిరం అంతా హాహాకారాలు వెల్లువెత్తాయి.
ఖిల్జీ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. నవ్వు ఆపకుండా గవాక్షం నుండి మరోసారి గంధిని పట్టణం వైపు చూశాడు. అతని మనసులోని భావాన్ని గ్రహించినట్లు అతని సైన్యం నగరం మీద దాడిని మొదలుపెట్టింది.
ప్రతి ఇంటిమీదా సుడులు తిరుగుతూ పొగలు వెలువడుతున్నాయి. దొరికిన వారిని దొరికినట్లు సంహరిస్తున్న ఖిల్జీ సైనికులు గుర్రాలమీద అటూ ఇటూ తిరుగుతున్నారు.
ఇంకొంతమంది సైనికులు ప్రజల విలువైన వస్తువులను దోచుకునే పనిలోపడ్డారు. కొంతమంది ప్రజలు పొలాలకు అడ్డంపడి పరుగెత్తుతున్నారు.
మారణహోమం సాగిపోతోంది. కాసేపటి క్రితం అందంగా, హుందాగా కనిపించిన 'గంధిని' ఇక చరిత్రలో చిత్తరువే అనుకుంటే ఖిల్జీ ఉత్సాహం ఇంకా ఎక్కువైంది.
తగలబడుతున్న నగరాన్ని చూస్తూ ఆనందిస్తున్నాడు ఖిల్జీ.
🔥
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*
