Sunday, 23 March 2025

 



ప్రాంజలి ప్రభ -- కీర్తన 


రాగదీపార్చిలో - రాజీవ నేత్ర రమ్ము

యోగ్యతే నీకృపా - యోగమ్ము నీ దయార్ద   

వేగ నాకిప్పుడే - పీయూష పాత్ర నిమ్ము 

మూగనై నేనుంటి - ముఖ్యమ్ము నీ దయార్ద

మూఁగ డెందమ్ములో - మోదమ్ము పొంగిపోవు

భాగమై నేనున్న - బాధ్యాత నీ దయార్ద  

భావనావీథిలో - భాసిల్లు తార నీవు 

సేవలే నాయిచ్చ - సీఘ్రమ్ము నీ దయార్ద

నమో వెంకటేశాయ నమో నమో నమః 

నమో శ్రీనివాసాయ నమో నమో నమః    

*

రావేల నను జూడ - రమణీయముగ నాడఁగా 

సేవల్లె కథలాగా  - శీఘ్రమే మదిభక్తిగా  

భావాల నవగీతి - స్వరయుక్తముగ పాడఁగా

కావడి కలలాగ - కావ్యమే మదిభక్తిగా    

జీవమ్మునకు స్ఫూర్తి - చెలువమ్ముగను వచ్చుఁగా

నవలా కదలికలు - నటనలా మదిభక్తిగా  

రేవెల్గు చిఱుకాంతి - ప్రియమార సుగమిచ్చుఁగా 

నావాక్కు నీకుగా  - నయనాల మదిభక్తిగా

నమో వెంకటేశాయ నమో నమో నమః 

నమో శ్రీనివాసాయ నమో నమో నమః    

*

జీవన మది యొక్క - చెఱసాల బంది నేను  

ఈవన మది యొక్క - యెడవేమొ లేవలేను 

త్రోవయు కనరాదు - తుది లేని యానమయ్యె 

దేవుని దయ నాదు - దిశయందు+ తోఁచదయ్యె 

నమో వెంకటేశాయ నమో నమో నమః 

నమో శ్రీనివాసాయ నమో నమో నమః    

*

రాగదీపము: ఇం/ఇం - ఇం/చం

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

****

*మా_బాల్యం*

ఒకప్పుడు...పరీక్ష రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలు..
ముందు రోజు రాత్రి నిద్ర వుండేది కాదు.
నిద్రలోనూ భగవంతునికి మొక్కులే!

ఫస్టు క్లాసు అక్కర్లేదు కానీ పేపర్లో నెంబరు వుండేలా చూడమని దేవుడికి పదే పదే అర్జీలు.

ఉదయాన్నే లేచి.. పేపరు కోసం సెంటర్లోకి పరుగు
అప్పటికే కిల్లీ బడ్డీ దగ్గర అన్ సోల్డ్ పేపర్లు అన్నీ సోల్డ్ అయిపోతే..

వీధిలో ఎవరు పేపరు వేయించుకుంటారా అని వెదుకులాట.

ఎలాగోలా ఒక పేపరు సంపాధిస్తే.. పది మంది మిత్రులు పోటీ..
కంగార్లో నెంబరు సరిగ్గా కనిపించకపోవడం..

రెగ్యులర్ నెంబర్లు ఒకవైపు, కంపార్ట్ మెంట్ నెంబర్లు మరో వైపు
వాటిలో మళ్లీ, ఫస్టు, సెకండు, థర్డ్ క్లాస్ లు.
ఫస్టు క్లాసులు అయితే..రెండుమూడు వరసలే! సెకండ్ మరికొంచెం..థర్డ్ క్లాసయితే... సగం పేజీ..   మొదట ఫస్ట్ క్లాస్ కాలమ్ లో వెదుకులాట.-ఆశ..

నెంబర్ లేకపోయే సరికి మనకు అంత సీను లేదులే అనుకుని
సెకండ్ క్లాస్ ఆపై థర్డ్ క్లాస్ కాలమ్స్ లో నెంబరు వెదుకులాట..

హమ్మయ్య నెంబరు వుంది అనుకోగానే వేయి ఏనుగుల బలం.. కొండంత ఆనందం.. పాస్ అయిన హాల్ టిక్కెట్ నెంబరు వున్న పేపరు భద్రంగా దాచుకోవడం.

ఆ తర్వాత, నా ముందు నెంబరు, తర్వాత నెంబరు వుందో లేదో చూడటం.. అదో ఆనందం..

ఇక అక్కడ నుంచి ఎవరెవరు పాసయ్యారు.. ఏ క్లాసులో పాసయ్యారు..

గోల గోల.. రిజల్ట్ చూడటానికి రానివాళ్ల ఇంటికి అంతా గుంపుగా వెళ్లి ఆనందం పంచుకోవడం..

ఫెయిల్ అయిన వాళ్ల ఇళ్లకు ఓదార్పు యాత్ర.

ఇక అక్కడ నుంచి మాస్టార్ల ఇళ్లకు వెళ్లి రిజల్ట్స్ చెప్పుకోవడం.. వాళ్లతో ఆనందం పంచుకోవడం..

ఈలోగా ఇంటి దగ్గర అమ్మ నాన్న, అన్న తమ్ముడు అంతా వీధిలో మీటింగు మావోడు పాసయ్యాడు అంటే పాసయ్యాడని..

స్వీట్లు..అదే అమ్మచేసిన లడ్డూల  పంపకం..

ఇక ఆ రోజంతా .. ఇంట్లో .. వీధిలో మనమే హీరో..

కట్ చేస్తే..

ఇప్పుడు...
ఆ ఆనందం.. గర్వం.. సంతృప్తి.. ఏవీ..??

ఇప్పడు ....పరీక్ష పాసైన పిల్లల్లో అవేవీ కనిపించడం లేదు.. ప్రతి ఇంట్లోనూ పాసయినా... ఏడుపే!

అంతా నిర్లిప్తత..
పాసయ్యామా అని కాదు.. ఎన్ని మార్క్లులొచ్చాయ్.. ఇదీ ప్రశ్న

ఎన్ని మార్కులొచ్చినా.. ఇంకా వస్తే బావుండేది.. సంతృప్తి ఎక్కడా..?

ప్చ్..

చిన్న చిన్న ఆనందాలకు పిల్లలు దూరం అవుతున్నారు..
కాదు మనం కూడా దూరం చేస్తున్నాం.

చదివే యంత్రాలవుతున్నారు..
ర్యాంకులను ఇచ్చే ప్రింటర్లు అవుతున్నారు..

విద్యార్థులు మాయం అవుతున్నారు..

మిషన్లులా మిగులుతున్నారు.. 

ఈనాటి పరిస్థితులు తప్పక  మారాలి.

ఒకసారి కాలం వెనక్కి వెళిపోతే ఎంత బాగుణ్ణు . చిన్న అత్యాశ


*****



 



****

విలువైన సలహాలు (విదేశీ జానపద హాస్య కథ) 

ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. ఉండడానికి ఒక చిన్న ఇల్లు గానీ, పండించుకోడానికి కొంచెం పొలం గానీ లేదు. పొద్దున లేచినప్పటి నుంచీ రాత్రి పండుకునేదాకా ఎంత పనిచేసినా కమ్మగా కడుపునిండా తినిన రోజూ లేదు. కంటినిండా కలలుగంటూ నిద్రపోయిన రాత్రీ లేదు. పెళ్లయితే తలరాత మారుతుంది అనుకున్నాడు కానీ ఇద్దరూ కలసి ఒళ్ళొంచి ఎంత కష్టపడినా ఏ మార్పు రాలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది పరిస్థితి. దానికితోడు ఒక కొడుకు కూడా భూమి మీదికి వచ్చినాడు. చూస్తుండగానే పిల్లోనికి పదేళ్ల వయసొచ్చింది.

"కట్టుకున్న పెళ్ళానికి, కడుపున పుట్టిన కొడుకుకి కడుపునిండా తిండి కూడా పెట్టలేని బతుకూ ఒక బతుకేనా..." అనుకుంటూ ఒక రోజు పెళ్ళాంతో "నేను ఇక్కడే ఇలాగే ఉంటే మన బతుకు ఒక ఇంచు కూడా ముందుకు పోదు. ధైర్యం చేసి ముళ్ళదారిలో ముందడుగు వేస్తేనే బతుకుదారి బాగుపడేది. నువ్వు సంపాదించే దానితో పిల్లోన్ని చూసుకో. నేను ఏదైనా నగరానికి పోయి హాయిగా బతకడానికి కావలసినంత డబ్బు సంపాదించుకొని వస్తా" అంటూ వంద జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు.

నాలుగు వారాలు నడిచీ నడిచీ చివరికి ఒక నగరానికి చేరుకున్నాడు. తీరా చూస్తే అక్కడ ఎక్కడ చూసినా అందరూ తనలాంటి పేదవాళ్లే పనుల కోసం వెతుకుతా కనపడ్డారు. వారం రోజులు వీధుల్లో పడుకుంటా, చెరువుల్లో స్నానం చేస్తా పనుల కోసం వెతికాడు. ఏ ఇంటి తలుపు కొట్టినా పొమ్మనేటోళ్లే తప్ప రమ్మనేటోళ్లు కనపడలేదు.

చివరికి ఒక పెద్ద మనిషి కనబడ్డాడు. అతను బాగా చదువుకున్నవాడు. తెలివైనవాడు. నగరంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సలహాలు ఇచ్చి ఆదుకుంటూ ఉండేవాడు. అతని దగ్గరికి పోయి "అయ్యా తినడానికి తెచ్చుకున్న డబ్బులు అన్నీ నిన్నటికే అయిపోయాయి. పొద్దున్నుంచీ ఉత్త నీళ్లు తప్ప కడుపుకింత తిండి లేదు. ఏదైనా పని ఉంటే చెప్పండి. ఇంటి ముందు కుక్కలా నమ్మకంగా ఉంటా... ఒంటికి కవచంలా కాపాడుతూ ఉంటా..." అన్నాడు.   

ఆ పెద్దమనిషి "నీ మాటల్లోనే నీ మంచితనం, నిజాయితీ అర్థం అవుతా వున్నాయి. ఉండడానికి గది ఇస్తా. తినడానికి తిండి పెడతా. జీతం మాత్రం నువ్వు తిరిగి ఎప్పుడు వెళతావో అప్పుడు ఒకేసారి ఇస్తా. ఆశకు పోకుండా ఎంత ఇస్తే అంత తీసుకో" అన్నాడు. ఆ మాత్రం ఆసరా దొరకడం కూడా అదృష్టమే అనుకుంటూ మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నాడు.

నెమ్మదిగా కాలం దొర్లుతావుంది. చూస్తుండగానే పది సంవత్సరాలు పూర్తయిపోయాయి. పెళ్ళాం పిల్లలు పదే పదే కళ్ళముందు మెదులుతా ఉన్నారు. కళ్ళల్లో నీళ్లు కారుతా ఉన్నాయి. గుండె బరువెక్కుతా ఉంది. ఇక లాభం లేదనుకొని యజమాని దగ్గరికి పోయి "అయ్యా... అడుగుపెట్టి పదేళ్లు అవుతావుంది. కళ్ళు మూసినా తెరిచినా ఇళ్ళూ ఇల్లాలే కనపడతా ఉన్నాయి. ఇక ఇక్కడ కాలు నిలవడం కష్టం. మీరు అనుమతించి నా జీతం గనుక ఇస్తే ఇంటికి పోతా" అన్నాడు.

దానికి యజమాని "ఈ లోకంలో ఎవరు ఎంత కష్టపడినా పెళ్ళాం బిడ్డల పెదాలపై చిరునవ్వు చూడడానికే కదా... నమ్మకంగా నా మనసు తెలుసుకొని పనిచేశావు. నీలాంటివాడు మరలా దొరకడు. నువ్వు వెళతానంటే బాధగానే వుంది" అంటూ భుజంతట్టి వాని చేతిలో జీతం కింద మూడు బంగారు నాణాలు పెట్టాడు.

ఆ పేదరైతు సంబరంగా ఆ నాణాలను కళ్ళకు అద్దుకొని పోతావుంటే ఆ పెద్దమనిషి "చూడు... నీవు గనక నాకు ఒక బంగారు నాణెం తిరిగి ఇస్తే నీకు జీవితంలో ఉపయోగపడే ఒక మంచి సలహా ఇస్తా. లేదంటే నీ ఇష్టం. ఇంత తక్కువ ధరకు నేనింతవరకూ ఎవరికీ ఏ సలహాను ఇవ్వలేదు" అన్నాడు.

రైతు ఆలోచనలో పడ్డాడు. "తన యజమాని ఎంత తెలివైనవాడో అతనికి బాగా తెలుసు. ఎక్కడెక్కడి దేశాలవాళ్ళు అతని కోసం వచ్చి అడిగినంత ధనమిచ్చి సలహాలు తీసుకుంటూ ఉంటారు. మూడు నాణాలలో ఒక్కటి ఇద్దాం. ఇంకా రెండు ఉంటాయి కదా" అనుకుని అతని చేతిలో ఒక బంగారు నాణెం పెట్టాడు.

యజమాని చిరునవ్వు నవ్వి "బాగా గుర్తు పెట్టుకో. నీకు సంబంధం లేని విషయాలలో పొరపాటున కూడా జోక్యం చేసుకోవద్దు" అని చెప్పాడు.

రైతు వినయంగా అలాగేనంటూ తిరిగి పోతావుంటే ఆ పెద్దమనిషి "చూడు... ఇంకో బంగారు నాణెం ఇస్తే ఇంకో సలహా ఇస్తా" అన్నాడు. రైతు ఆలోచనలో పడ్డాడు. చేతిలో ఉన్నవి రెండే. కానీ అతను ఇచ్చే సలహాలు ఆ బంగారు నాణాల కంటే ఎంతో విలువైనవి. డబ్బు కోసం చూసుకుంటే బంగారం కన్నా విలువైన సలహా పోగొట్టుకోవచ్చు" అనుకొని  రెండవ వరహా అతని చేతిలో పెట్టాడు.

ఆ పెద్దమనిషి చిరునవ్వుతో "బాగా గుర్తు పెట్టుకో... నీకు తెలియని కొత్త ప్రదేశాలలో విశ్రాంతి తీసుకోకు" అని చెప్పాడు.

అలాగేనంటూ ఆ రైతు వెనక్కి తిరగగానే ఆ పెద్దమనిషి చిరునవ్వుతో "చూడు... నాకు ఇంకో వరహా ఇస్తే ఇంకో సలహా చెప్తా" అన్నాడు. పేద రైతు ఆలోచనలో పడ్డాడు. "చేతిలో ఒకే ఒక్క వరహా ఉంది. ఇది ఉంటే ఏమి లేకుంటే ఏమి. సలహా మాత్రం వదులుకోకూడదు" అనుకుంటూ దానిని కూడా అతని చేతిలో పెట్టేశాడు.

ఆ పెద్దమనిషి చిరునవ్వుతో "బాగా గుర్తుపెట్టుకో. తొలి కోపం మంచిది కాదు. ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచించి అడుగు వెయ్యి" అన్నాడు.

మూడు వరహాలకు మూడు సలహాలు అందుకొని ఆ రైతు ఇంటిదారి పట్టాడు. అలా ఒక వారం రోజులు నడిచాక ఒక అడవిలో ఒక వింత దృశ్యం కనపడింది. ఒక గంధర్వుడు ఒక చెట్టు మీద కూర్చుని ఆకులకు బంగారు నాణాలు అంటిస్తూ ఉన్నాడు. అది చూస్తూనే అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. 'అలా ఎందుకు అంటిస్తా ఉన్నాడో కనుక్కోవాలి' అనుకున్నాడు. అంతలో ఆ రైతుకు తన యజమాని చెప్పిన "నీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోకు" అనే సలహా గుర్తుకు వచ్చింది. దాంతో 'మనకెందుకులే అనవసరంగా' అనుకుంటూ అక్కడినుంచి ముందుకు నడిచాడు.

అలా నాలుగు అడుగులు వేశాడో లేదో ఆ గంధర్వుడు అతన్ని పిలిచి "మిత్రమా... నూరు సంవత్సరాలుగా ఈ చెట్టు ఆకులకు వరహాలు అంటిస్తూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాలలో ఎందుకిలా అంటిస్తా ఉన్నావు అని ఒక్క మాట కూడా అడగకుండా వెళ్ళిపోతావున్నది నీవు ఒక్కనివి మాత్రమే" అన్నాడు.

దానికి ఆ రైతు "అయ్యా... మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. నాకు సంబంధం లేని విషయాలతో నాకెందుకు" అన్నాడు. అది విని గంధర్వుడు సంతోషంగా "అదీ మాటంటే. ప్రతి ఒక్కడూ పనున్నా లేకున్నా పక్కవాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడడమే తప్ప, తన పని తాను చేసుకోడు. మొదటిసారి ఇలాంటి కమ్మని మాట వినడం. నీకు బహుమతి ఖచ్చితంగా ఇవ్వవలసిందే" అంటూ ఆ చెట్టు కొమ్మలను పట్టుకొని అటూ ఇటూ బలంగా ఊపాడు. అంతే గలగలగల బంగారు నాణాలు కొన్ని పైనుంచి కిందపడ్డాయి. "ఇవన్నీ నీకోసమే. తీసుకో" అన్నాడు గంధర్వుడు. రైతు సంబరంగా వాటిని ఒక సంచి నిండా నింపుకొని తనకు అంత మంచి సలహా ఇచ్చిన యజమానికి మనసులోనే దండం పెట్టుకుంటూ అక్కడినుంచి బైలుదేరాడు.

అలా ఒక వారం రోజులు ఆ అడవిలో నడుస్తూ పోతూవుంటే అతనికి ఒకచోట గాడిదల మీద సరుకులు వేసుకొని పోతూవున్న ఒక వ్యాపారి కనబడ్డాడు. అతన్ని చూసి ఆ రైతు "అయ్యా... నడిచీ నడిచీ కాళ్ళు పీకుతా ఉన్నాయి. ఒక గాడిద మీద నన్ను కూర్చొనిస్తే ఒక బంగారు వరహా యిస్తా" అన్నాడు. ఆ వ్యాపారస్తుడు సంబరంగా 'సరే' అన్నాడు.

వాళ్లు అలా కొంతదూరం పోయేసరికి ఒకచోట ఒక పూటకూళ్ల ఇల్లు కనపడింది. ఆ వ్యాపారస్తుడు "మిత్రమా... నాకు చాలా ఆకలిగా ఉంది. కడుపునిండా తిని కమ్మగా కాసేపు విశ్రాంతి తీసుకుందాం" అన్నాడు. అంతలో ఆ రైతుకు "కొత్త ప్రదేశాలలో విశ్రాంతి తీసుకోకు" అని తన యజమాని చెప్పిన రెండవ సలహా గుర్తుకు వచ్చింది. దాంతో "అయ్యా... మీరు వెళ్లి తిని రండి. నేను ఇక్కడే ఈ గాడిదలకు కాపలాగా ఉంటాను. నాకు ఆకలిగా లేదు" అన్నాడు.

దాంతో వ్యాపారస్తుడు సరేనని ఆ పెంకుటిల్లు లోపలికి పోయాడు. అలా పోయిన కాసేపటికి అక్కడ పెద్ద ఎత్తున భూమి కనిపించింది. దాంతో కళ్ళముందే ఆ పెంకుటిల్లు ధన ధన ధన కూలిపోయి పాపం లోపలున్న వాళ్లంతా అందులోనే సమాధి అయిపోయారు. దాన్ని చూడగానే రైతు భయంతో వణికిపోయాడు. యజమాని సలహా పట్టించుకోకుండా తాను కూడా లోపలికి పోయివుంటే ఇప్పటికల్లా ఏమైపోయేవాడినో కదా అనుకుంటూ తన యజమానికి మనసులోనే దండం పెట్టుకొని ఆ గాడిదలను తోలుకొని అక్కడినుండి బైలుదేరాడు.

అలా రెండు వారాలు ప్రయాణించి చివరికి తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపు కొట్టాడు. ఇల్లు వదిలి పది సంవత్సరాలు దాటింది. జుట్టు పెరిగి, గడ్డం పెరిగి, వయసు పెరిగి మొత్తం రూపం అంతా మారిపోయి ఉన్నాడు. అదిగాక అప్పటికే మసక మసక చీకటి పడతా ఉంది. దాంతో తలుపు తెరిచిన రైతుపెళ్ళాం తన మొగున్ని గుర్తుపట్టలేకపోయింది.

"ఎవరు మీరు. ఏం కావాలి" అంది.

అతను కూడా వెంటనే విషయం చెప్పకుండా సరదాగా పెళ్ళాన్ని ఆటపట్టించాలని "అమ్మా... చాలా దూరం నుంచి వస్తున్నాను. ఈరోజు రాత్రికి ఇక్కడ ఎక్కడైనా ఉండవచ్చా. పొద్దున్నే వెళ్ళిపోతా" అన్నాడు. దాంతో ఆమె జాలిపడి "ఇంటి లోపలికి ఎవరినీ రానివ్వలేను. కాకపోతే బయట ఉన్న గుడిసెలో విశ్రాంతి తీసుకోవచ్చు" అంది.

రైతు చిరునవ్వుతో "పొద్దున్నే నా పెళ్ళాం నన్ను గుర్తుపట్టి తాను చేసిన పనికి ఎంత సిగ్గుపడుతుందో ఏమో" అని నవ్వుకుంటూ 'అలాగేనమ్మా' అని గాడిదలను తీసుకొనిపోయి ఆ గుడిసెలో కట్టేసి విశ్రాంతి తీసుకోసాగాడు.

ఒక గంట గడిచేసరికి బాగా చీకటి పడింది. ఆ చీకటిలో ఒక యువకుడు వచ్చి ఆ ఇంటి తలుపు కొట్టాడు. తలుపు తెరవగానే నవ్వుకుంటూ లోపలికి పోయి తలుపు మూసేశాడు. అది చూడగానే రైతు అదిరిపోయాడు. "అరెరే... నా పెళ్ళాం నేను ఇల్లు వదిలి వెళ్ళిపోగానే చూసి చూసి ఇంక రానేమో అనుకొని వేరేవాన్ని పెళ్లి చేసుకున్నట్టుంది. ఈ పెళ్ళాం బిడ్డల కోసమే కదా ఇన్ని రోజులూ ఇంత కష్టపడి సంపాదించింది. వీళ్ళు లేనప్పుడు ఇక బ్రతికి ఏం లాభం. వీళ్లను చంపి నేను చస్తా" అని కోపంతో ఊగిపోతూ కత్తి అందుకున్నాడు. అంతలో అతనికి "తొలి కోపం మంచిది కాదు. ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచించి అడుగు వెయ్యి" అని తన యజమాని చెప్పిన సలహా గుర్తుకు వచ్చింది.

దాంతో ఆ రాత్రంతా ఆలోచిస్తా ఉన్నాడు. కోపం కొంచెం కొంచెం తగ్గుతా ఉంది. అంతలో తొలికోడి కూసింది. ఇంట్లో దీపం వెలిగించిన వెలుతురు, పనులు చేస్తున్న చప్పుళ్ళు వినబడతావున్నాయి. కాసేపటికి తలుపు తెరుచుకుంది. రాత్రి తాను చూసిన యువకుడు బయటికి వచ్చాడు.

"అమ్మా... నేను పనికి పోయి వస్తా. రాత్రి తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి కావలసిన సరుకులు అన్నీ తీసుకొని వస్తా" అన్నాడు. ఆమె లోపలినుంచి "అలాగే నాయనా... జాగ్రత్తగా వెళ్లి రా" అంది.

ఆ మాటలు వినేసరికి ఆ రైతు మొహంలో నెత్తురు చుక్క లేదు. "అయ్యో... నా పెళ్ళాం నన్ను గుర్తుపట్టనట్లే, నేను నా కొడుకుని గుర్తుపట్టలేకపోయా. ఆవేశంతో తొందరపడి ఏదైనా చేసివుంటే జీవితాంతం బాధపడవలసి వచ్చేది. తొలికోపం ఎవరికైనా మంచిది కాదు" అనుకుంటూ వాళ్ల ముందుకు వచ్చి, తాను ఎవరో చెప్పి కొడుకుని మనసారా కౌగిలించుకున్నాడు.

ఆ తరువాత తన వద్ద ఉన్న బంగారు నాణాలతో వాళ్లు మంచి పొలం కొనుక్కొని, పెద్ద మిద్దె కట్టుకొని జీవితాంతం హాయిగా కలసిమెలసి జీవించారు.

****

*ప్రాంజలి ప్రభ ..కీర్తన  

 

ఎన్నెన్ని యాశలో - యీనాఁడు డెందమ్ములో 

కలలన్ని తీర్చేటి -  మా ఇష్ట దైవమ్ము యే  

పున్నెమ్ము నీవెగా - మోదమ్ము బంధమ్ములో

కథలన్ని తీర్చేటి - మా నిత్య దైవమ్ము యే  

కన్నీళ్లు వద్దు నీ - కందమ్ము మాయుంగదా 

వెతలన్ని తీర్చేటి - మా సత్య దైవమ్ము యే    

పన్నీటి జల్లుతో+ - ప్రాణమ్ము లేచుంగదా 

పలుకుగా తీర్చేటి - మా దివ్య దైవమ్ము యే 

ఎండు కొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ...

ఆపద మొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా  

*

రంగులే నిండెనే - రమ్యమ్ము నిను జూడఁగా 

ఛంగునా దూకేను - దివ్యమ్ము నిజ దర్శనం  

రంగమే మ్రోఁగెనే - రాగాల నుడి పాడఁగా 

భంగమే లేకుండ - భవ్యమ్ము నిజ దర్శనం  

శృంగముం జేరెనే - నృత్యమ్ము వడి యాడఁగా

అంగాంగ పూజలే - నిత్యమ్ము నిజ దర్శనం  

అంగనా పొంగె నా - హర్షమ్ము నడయాడఁగా 

మంగళం పాటగా -  ధైర్యము నిజ దర్శనం 

ఎండు కొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ...

ఆపద మొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా  

*

ఏమి యానందమో - యీనిన్ను దర్శించఁగా 

ఏమి యాహాయియో - యీనిన్ను స్పర్శించఁగా 

ఏమి యీజీవమో - యీనీవు లేకుండఁగా 

స్వామి నీవేగదా - సత్యమ్ము నాకండగా 

ఎండు కొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ...

ఆపద మొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా  

***

*రాగదీపము - ఇం/ఇం - ఇం/చం

విధేయుడు::  mallapragada  రామకృష్ణ 

pranjali prabha ఓ మంచి కధ చదవండి..

**********************

ఓ యువకుడు ఓ మంచి ఉద్యోగం కోసం ఓ పెద్ద కంపెనీకి ఇంటర్వూకు వెళ్ళాడు.

చక్కగా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు............
చివరి పరీక్షకు డైరెక్టరు దగ్గరికి వెళ్ళాడు.
*డైరెక్టరు* : నీవు చదువుకునే రోజుల్లో ఏదైనా స్కాలర్షిప్ వచ్చిందా?
*యువకుడు*: లేదండీ! మా అమ్మ-నాన్నగార్లె అన్ని ఫీజులు కట్టెవారు.......
*డైరెక్టరు*: మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు?
*యువకుడు*: ఖాళీ-సిసలు పాత-ఇనుము వెస్ట్-పేపర్ ప్లాసిటిక్-స్క్రాప్ చిన్న-చిన్న-వ్యాపారములు చేసి అదే పనిని వృ త్తిగా మార్చుకొని నన్ను చదివించారు.......
*డైరెక్టరు*: అయితే నీ చేతులను ఒకసారి నాకు చూపించు.
*యువకుడు*: తన చేతులను చూపించాడు........

అవి చాలా సున్నితంగా నాజూకుగా సుతి-మెత్త్తగా ఉన్నాయి.

*డైరెక్టరు*: నువ్వు ఎప్పుడైన నీ తల్లిదండ్రులకు వారు చేసే పనిలో సహాయపడ్డావా?
*యువకుడు*: లేదండీ! వారు నన్ను కష్టపడనివ్వకుండా మంచిగా చదువుకునిమంచి ఉద్యోగం సంపాదించమని చెప్పేవారు.....నేను అలాగే చేశాను.

*డైరెక్టరు*: నిజంగా నువ్వు ఈ ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉన్నావాడివి.

*డైరెక్టరు*: నాదొక చిన్నవిన్నపం.చేస్తాను అంటేనే చెపుతాను.

*యువకుడు*: తప్పకుండా చేస్తాను చెప్పండి సర్.
*డైరెక్టరు*: ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తరువాత మీ తల్లిదండ్రులకు మూడు-రోజులు విరామము ఇచ్చి.....

వారు చేసే పనిని నీవు సర్రిగ్గా మూడు-రోజులు చేసి.....రా! తప్పకుండా నువ్వు ఈ ఉద్యోగంలో చేరవచ్చు....

*యువకుడు*: అలాగే సర్. అని.. తల్లిదండ్రులకు సహాయపడటానికి వెళ్లి వారిని చూడగానే విపరీతంగా ఏడ్చాడు.....

ఆ-చేతులు కాయలుగట్టి.........

కాళ్లకు-చేతులకు సీసవక్కలు-ఇనుపసమాను ముక్కలు కుచ్చి

రక్తం కారుతూ....... గరుకుగా.......చాలా ఘోరంగా కనపడ్డాయి......

ఆ చేతులలో తన మొహాన్ని పెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు.....వారి కష్టాన్ని తలచుకుని వారు చేసే పనిని తానే అ-మూడు-రోజులు

తల్లిదండ్రుల మీద-ఉన్న ప్రేమతో.... ఇష్టముతో.... కష్టపడి తన-డైరెక్టరు పెట్టిన పరీక్షను పూర్తి చేసాడు.

మరుసటిరోజు ఆఫీసుకు కాళ్లకు-చేతులకు సీసవక్కలు-ఇనుపసమాను ముక్కలు కుచ్చిన వాటికీ డాక్టర్-వద్ద ప్రథమ-చికిత్స చేయిన్చుకొని కళ్ళల్లో నీళ్ళతో వెళ్ళి ....

ఆ డైరెక్టరు పాదాలకు నమస్కరించాడు...."

మీరు నా కళ్ళు తెరిపించారు సర్!
నా తల్లిదండ్రుల కష్టాన్ని నాకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
మీరు నాకు ఈ ఉద్యోగాన్ని ఇస్తే వారిని కంటికి రెప్పలా ఏ లోటూ లేకుండా కాపాడుకుంటాను"
దానికి డైరెక్టరు ఇలా సమాధానం ఇచ్చారు......"
ఇంట్లో తల్లిదండ్రుల కష్టం తెలిసిన వారికే ఆఫీసులోని పై అధికారుల కష్టాలు అర్థంఅవుతాయి.......

కాబట్టి ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి ఉన్నవారికే మా-ఆఫిసులో ఉద్యోగాలు ఇవ్వాలని నీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇలాంటిచిన్న పరీక్ష పెట్టడం జరిగింది...

నీవే ఈ ఉద్యోగానికి 100% అర్హుడవు.
*కాబట్టి డబ్బులు పెట్టి మనల్ని చదివిస్తున్నారుకదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండాఅసలు ఆ ఫీజుకు కట్టడానికి తల్లిదండ్రులు పడే కష్టాన్ని ఒక్కసారి తలచుకుని చక్కగాచదువుకుని ప్రయోజకులు కండి,,,*,,
ఆల్ ది బెస్ట్.............

--((***))--

మార్చి 20, అంతర్జాతీయ కథల దినోత్సవం రోజు.. బంగారమంటి బామ్మ కథ.. 

"బంగారు మురుగు" (1 )

శ్రీరమణ గారు రచించిన మిథునం కథా సంకలనం లోనిది.

బంగారు మురుగు

నాకు ఆరేళ్ళప్పుడు మా బామ్మకి అరవై ఏళ్లు.


మా అమ్మానాన్న ఎప్పుడూ పూజలూ పునస్కారాలూ, మళ్ళూ దేవుళ్ళూ గొడవల్లో వుండేవారు. స్వాములార్లు, పీఠాధిపతులూ ఎత్తే పల్లకీ, దింపే పల్లకీలతో మా ఇల్లు మరంలా వుండేది. అమ్మ తడిచీర కట్టుకుని పీఠాన్ని సేవిస్తూ నే దగ్గరకు వెళితే దూరం దూరం తాక్కూడదు అనేది.


బామ్మకి యీ గొడవలేం పట్టేవి కావు. అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ నాకు బామ్మే. మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ నేనే. ఓకంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం.


పెద్దతనపు నస, అత్తగారి సాధింపులూ వేధింపులూ బామ్మ దగ్గర లేవు. ఎవరేనా “ఈ ముసలమ్మకి భయమూ భక్తీ రెండూ లేవు…” అంటే – “దయకంటే పుణ్యంలేదు. నిర్దయకంటే పాపం లేదు. చెట్టుకి చెంబెడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకొన్న వాడికి పట్టెడు మెతుకులు పెట్టడం – నాకు తెలిసిందివే “ అనేది.


బామ్మకి పుట్టింటి వాళ్ళిచ్చిన భూమి నాలుగైదెకరాలు ఇంకో ఊళ్ళో ఉండేది. మా ఊరికి పది కోసుల దూరం. ఏటా పంటల కాలంలో కౌలు చెల్లించటానికి రైతులు వచ్చేవాళ్ళు. వచ్చీ రాగానే వాళ్ళని ఆప్యాయంగా పలకరించేది. పుట్టిన ఊరు విశేషాలన్నీ గుక్క తిప్పుకో కుండా అడిగేది. వాళ్ళు బదులు చెప్పకుండానే మళ్ళీ ప్రశ్న – ప్రశ్న మీద ప్రశ్న వర్షం కురిపించేది. రైతులేమొ పంట తెగుళ్ళగురించి, అకాల వర్షాల గురించి సాకులు చెప్పి పావలో బేడో చేతిలో పెట్టి వెళ్ళాలనే ఆలోచనతో దిగులు మొహాలు తగిలించుకు వచ్చేవాళ్ళు. ఆ మాట ఎత్తడానికి బామ్మ అవకాశం యిస్తేనా ?


“ఎండన పడి వచ్చారు, కాళ్ళు కడుక్కోండరా” అనేసి వడ్డన ఏర్పాట్లలో పడిపోయేది. విస్తరి వేసిందగ్గర్నించి పెరుగు అన్నంలోకి వచ్చేదాకా వాళ్ళతో ఊరివాళ్ళ కబుర్లన్నీ వాగించేది.


తీరా పెరుగన్నం చివర్లో “ఏరా అబ్బీ, యీ ఏడాది పంటలెలా వున్నాయిరా ” అని అడిగేది.


వాళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయేది. కమ్మటి భోజనం కొసరి కొసరి వడ్డిస్తే తిని, పైగా తిన్న విస్తరి ముందు కూచుని “పంటలు పోయాయి” అని చెప్పడానికి నోరాడక “ఫర్వాదేదమ్మా దేవుడి దయవల్ల” అనేవాళ్ళు. ఇంకేం చేస్తారు పాపం అణా పైసలతో శిస్తు అప్పగించి వెళ్ళేవాళ్లు. వెళ్లేప్పుడు “ఇదిగో బుల్లి పంతులూ! మీ అవ్వ గట్టి పిండమే !” అని ఎగతాళి చేసి వెళ్ళే వాళ్ళు.


బడికి వెళ్ళనని మారాం చేసినపుడల్లా బామ్మ నాకు అండగా వుండేది. “పసి వెధవ, గ్రాహ్యం వస్తే వాడే వెళ్తాడు- అయినా ఒక్కగానొక్కడు బతకలేక పోతాడా…” అంటూ నన్ను చంకన వేసుకు బయటకు నడిచేది.


మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు వుండేది. అది మా స్థావరం. రోజులో మూడొంతులు అక్కడే మా కాలక్షేపం. బాదంచెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్టు వుండేది. రాలిన పండు ఆకులు విస్తరి కుట్టుకుని బామ్మ భోజనం చేసేది. దాని చుట్టూ చిన్న మట్టిఅరుగు వుండేది. “దీన్ని కాపరానికొచ్చేప్పుడు మా పుట్టించినించి తెచ్చా… అప్పుడు జానాబెత్తెడుండేది… నువ్ నమ్మవ్… పిచ్చి ముండకి మూడే ఆకులు బుల్లి బుల్లివి వుండేవి…” రోజు ఒకసారైనా ఈ మాట నాకు చెప్పేది. నే కాపరానికొచ్చి ఎన్నేళ్ళో ఈ పిచ్చి మొద్దుకి అన్నేళ్లు అంటూ మానుని చేత్తో తట్టేది ఆపేక్షగా.


ఇప్పటికీ బామ్మ చెంబెడు నీళ్ళు దానికి పోస్తూనే వుంటుంది. మానుకి రెండు తొర్రలుండేవి. పై తొర్రలో రెండు రామచిలకలు కిలకిలలాడుతూ కాపరం చేస్తుండేవి. ఇంకో తొర్రలో బామ్మ నాకోసం చిరుతిళ్ళు దాచేది. కొమ్మకి తాళ్ల ఉయ్యాల వుండేది. నీడన ఆవుదూడ కట్టేసి వుండేది. దానికి బామ్మ పచ్చి పరకలు వేస్తూ వుండేది. కాకులు పడేసిన బాదంకాయలు వైనంగా కొట్టి నాచేత బాదం పప్పులు తినిపించేది. – ఆ బాదం చెట్టు మా ఇద్దరికీ తోడూ నీడా – ఊరు లేచేసరికి వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది బామ్మ. రాత్రి నాకు జోలపాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది. ముగ్గులు అయ్యేదాకా నేను బామ్మ వీపు మీద బల్లిలా కరుచుకు పడుకుని కునుకు తీస్తుండేవాణ్ణి. “అసలే నడుంవంగిపోయె… పైగా ఆ మూట కూడా దేనికి” – అని మా అమ్మ అంటే “వాడు బరువేంటే. వాడు వీపున లేపోతే ముగ్గు పడదే తల్లీ – చూపు ఆనదే అమ్మా” అనేది బామ్మ.


సమస్త దేవుళ్ళకీ మేలుకొలుపులు పాడుతూ వాకిలి నాలుగు దిక్కుల్నీ ముగ్గుతో కలిపేది. అప్పుడు మా మండువా లోగిలి నిండుగా పమిటకప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తయిదువులా వుండేది. “పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్లు లేవరా” అని అడిగితే “పిచ్చి సన్నాసీ దేవుళ్ళు నిద్దరోతారా! దేవుడు నిద్దరోతే యింకేమైనా వుందీ-! మేలుకొలుపులూ మనకోసమే చక్రపొంగలీ మనకోసమే” అనేది బామ్మ.


ఇంకా వుంది

****

ఆదిత్య హృదయం !

తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః

అగస్త్య ఉవాచ:
రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం

సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం

సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః

ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః

పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః

ఆదిత్య స్తోత్ర ప్రారంభం :
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః

హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండ అంశుమాన్

హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనః

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్ యజుస్సామ పారగః
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః

నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే

నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినధిపతయే నమః

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యోదయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే

నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వన్యేషు రవి: ప్రభుః

ఏనమాపత్సు కృచ్చేషు కాంతారేషుభయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవః

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్

ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా
ధారయామాస సుప్రీతొ రాఘవః ప్రయతాత్మవాన్

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరంహర్ష మవాప్తయాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్

అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమన్యాః పరమం ప్రహృష్యమాణః

నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి

ఇతి ఆదిత్య హృదయే సంపూర్ణం.
***

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

ఆదిత్య హృదయం !

తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః
.
రామరావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కలసి అగస్త్య మహర్షి కూడా వస్తాడు. యుద్ధంలో అలసివున్న రాముడిని చూసిన అగస్త్య మహర్షి "రామా! ఈ సందర్భంగా నీకు వేదంవలె నిత్యమైనదీ, మంగళకరమైనదీ, పురాతనమైనదీ, ఆరోగ్యప్రదాయకమైనదీ, ఆయుర్వృద్ధిని చేసేదీ, అత్యంత ఉత్తమమైనదీ, అతి రహస్యమైనదీ, అత్యంత లాభదాయకమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాను" అని పలికి, ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.
అగస్త్య ఉవాచ:
రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి
.
ఓ రామా! గొప్ప బాహువులు గల రామా! ఈ రహస్యమును విను. నీకు యుద్ధంలో విజయం కలుగును గాక!
.
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం
.
ఈ ఆదిత్య హృదయం వలన పుణ్యం, శత్రు నాశనం కలుగును. దీనిని చదువుట వలన జయం, శుభం, పరము కలుగును.
.
సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం
.
ఇది అత్యంత శుభకరమైనది, మంగళకరమైనది, అన్ని పాపములను నాశనం చేయునది. చింత, శోకం, ఒత్తిడిలను తొలగించి ఆయుర్వృద్ధి కలిగించును.
.
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం
.
ప్రకాశకుడైన, దేవాసురులచే పూజింపబడిన, తన ప్రకాశంతో లోకాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ భువనేశ్వరున్ని పూజింపుము.
.
సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః
.
ఈ ఆదిత్యుడు సకలదేవతలకు ఆత్మయైనవాడు. గొప్ప తేజం కలవాడు. తన కిరణాలతో లోకాలను రక్షిస్తుంటాడు. తన కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా ఎండావానలను కలిగించి దేవదానవులను, సకలజనులను కాపాడుతున్నాడు.
.
ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః
.
ఇతడు సమస్త శరీరాలు గలవాడగుటచే, ఇతడే బ్రహ్మా, విష్ణువు, కుమారస్వామి, ప్రజాపతుల రూపం, దేవేంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, చంద్రుడు, వరుణుడు.
.
పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః
.
ఇతడే పితృదేవతలు, వసువు, పంచభూతాలు, ప్రజలు శరీరంలోని ప్రాణవాయువు. ఋతువులను కలిగించే ప్రభాకరుడు.
.
ఆదిత్య స్తోత్ర ప్రారంభం :
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః
.
నీవు అదితి కుమారుడవు. నీవు సూర్యుడవు. నీవు ఆకాశంలో సంచరించేవాడివి. వర్షంతో జగాన్ని పోషించేవాడవు. పసిడి కిరణములు కలవాడవు. బంగారు తేజస్సు కలవాడవు. భానుడవు, హిరణ్యం రేతస్సుగా కలవాడవు. నీవు దివాకరుడవు.
.
హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండ అంశుమాన్
.
నీవు ఆకుపచ్చ గుఱ్ఱములు కలవాడవు. సహస్ర కిరణములు కలవాడవు. చీకటిని సంహరించేవాడివి. శుభములు కలుగజేసేవాడివి. బ్రహ్మాండాన్ని మరలా జీవింపజేయువాడవు. ప్రకాశవంతమైనవాడవు.
.
హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనః
.
నీవు హితమనే రమణీయ మనస్సు కలవాడవు. చల్లనివాడవు. అగ్నిగర్భుడవు. అదితిపుత్రుడువు. సాయంకాలంలో శమించువాడవు. మంచును పోగొట్టేవాడవు.
.
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్ యజుస్సామ పారగః
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః
.
ఆకాశానికి నాధుడవు. చీకటిని పోగొట్టేవాడవు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంల పారంగుడవు. గొప్ప వర్షాన్ని కురిపించేవాడవు. నీటికి మిత్రుడవు. ఆకాశామార్గమున శీఘ్రంగా పోయేవాడవు.
.
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః
.
ఎండ నిచ్చేవాడవు. గుండ్రనివాడవు. మృత్యువువి. ఉదయాన్నే లేతకిరణంలు కలవాడవు. మద్యాన్నం సర్వాన్ని తపింపజేయువాడవు. కవివి. మహాతేజుడవు. సమస్త కార్యాలకు కారణభూతుడవు.
.
నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే
.
నక్షత్రాలకు గ్రహాలకు నాయకుడవు. నీవే ఈ విశ్వ ఉనికికి కారణం. అన్ని తేజస్సుల కంటే తేజస్సును ఇచ్చువాడవు. ద్వాదశాదిత్యులలో అంతర్యామివైన నీకు నమస్కారం.
.
నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినధిపతయే నమః
.
తూర్పుకొండతో కూడినవాడికి నమస్కారం. పడమటకొండతో కూడినవాడికి నమస్కారం. జ్యోతిర్గణాలకు అధిపతివైన నీకు నమస్కారం. పగటిని కలిగించే నీకు నమస్కారం.
.
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
.
జయుడకి నమస్కారం. జయభద్రునికి నమస్కారం. పచ్చని గుఱ్ఱములు గల నీకు నమస్కారం. సహస్రాంసునకు నమస్కారం.
.
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః
.
ఉగ్రునకు నమస్కారం. వీరునకు, వేగంగా పయనించే నీకు నమస్కారములు. కమలములను వికసింపజేయు నీకు నమస్కారం. మార్తుండునికి నమస్కారం.
.
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యోదయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః
.
బ్రహ్మా, విష్ణు, మహేశుల అధిపతికి నమస్కారం. ఆదిత్య వర్చస్సుతో ప్రకాశించువానికి నమస్కారం. సర్వభక్షకునికి నమస్కారం.
.
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః
.
చీకటిని పోగొట్టువానికి నమస్కారం. శత్రువులను వధించేవానికి నమస్కారం. గొప్ప తేజస్సు గలవానికి నమస్కారం. స్వయంప్రకాశం గలవానికి నమస్కారం. దేవునికి, జ్యోతిషపతికి నమస్కారం.
.
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే
.
బంగారుకాంతివంటి కాంతి కలవాడు, అగ్నిరూపునకు, జగత్తుకు కారణమైనవాడికి నమస్కారం. విశ్వకర్మకు నమస్కారం. ప్రకాశాస్వరూపునకు నమస్కారం. లోకసాక్షికి నమస్కారం.
.
నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః
.
ఈ ఆదిత్యుడే మహా ప్రళయకాలంలో ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. తిరిగి తానే జగత్తును సృష్టిస్తాడు. నాశకాలం తప్ప, తక్కిన కాలంలో చక్కగా పరిపాలిస్తాడు.ఇతడు కిరణాలతో శోశింపజేస్తాడు, ఎండా, వానలను ఇస్తాడు.
.
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం
.
సకల జీవులు నిద్రిస్తుండగా, వాటిలో అంతర్యామిగా మేల్కొని ఉంటాడు. అగ్నిహోత్రం, అగ్నిహోత్రఫలమూ ఇతడే.
.
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వన్యేషు రవి: ప్రభుః
.
వేదాలు, యజ్ఞాలు, యజ్ఞఫలమూ ఇతడే. లోకంలోగల సర్వకార్యములకు ఈ రవియే ప్రభువు.
.
ఏనమాపత్సు కృచ్చేషు కాంతారేషుభయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవః
.
రామా! ఆపదలలో, భయంకలిగించే ప్రదేశాలలో, ఈ స్తోత్రంతో సూర్యుడిని కీర్తించేవాడు అన్ని ఆపదలనుండి రక్షింపబడతాడు.
.
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
.
నువ్వు మనస్సును ఏకాగ్రంచేసి ఆ దేవదేవుడు జగన్నాధుడైన సూర్యున్ని ఆరాదించు. ముమ్మార్లు ఈ స్తోత్రాన్ని జపిస్తే యుద్ధంలో విజయం నీకే.
.
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్
.
'మహాపరాక్రమశాలీ! నువ్వు ఈ క్షణాన్నే రావణుని సంహరిస్తావు' అని రామునితో అగస్త్య మహర్షి చెప్పి అక్కడినుండి నిష్క్రమిస్తాడు.
.
ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా
ధారయామాస సుప్రీతొ రాఘవః ప్రయతాత్మవాన్
.
అప్పుడు మహాతేజోవంతుడైన రాముడు ధైర్యంతో ఆనందమును పొంది, నిర్మల హృదయంతో ఆదిత్య హృదయంను జపించాడు.
.
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరంహర్ష మవాప్తయాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
.
రాముడు అలా ఆదిత్య హృదయమును జపించి మహదానందభరితుడయ్యాడు. తర్వాత ముమ్మార్లు ఆచమనం చేసి, మిగుల పరాక్రమముతో విల్లు ధరించాడు.
.
రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్
.
శ్రీరాముడు రావణున్ని చూసి ఉత్సాహంతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. రావణున్ని సంహరించాలని ధృడంగా నిశ్చయించుకున్నాడు.
.
అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమన్యాః పరమం ప్రహృష్యమాణః
.
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి
.
అలా తనను జపించుతున్న శ్రీరామున్ని చూసి, రాక్షసరాజు వినాశనంను గ్రహించి, చాలా ఆనందంతో 'నీవింక రావణుని వధింప త్వరపడమని, నీకు విజయం తధ్యమ'ని సూర్యభగవానుడు రామునితో చెప్పెను.
ఇతి ఆదిత్య హృదయే సంపూర్ణం.

***