Friday, 26 April 2024

stories

 


ఆరోగ్య ప్రదాత

కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఈ ఏడాదితో శత సంవత్సరంలోకిi అడుగుపెడుతున్నారు.

స్వామివారు పీఠాధిపత్యం వహించగానే, స్వామివారు వేద వ్యాప్తికి, వేద ప్రచారానికి కార్యోన్ముఖులై ఎన్నో పాఠశాలలను పునరుద్ధరించి, ఎంతోమంది వేదపండితులకు జీవితాంతం ఆర్ధిక స్వావలంబన చేకూర్చే దిశగా నిమగ్నమయ్యారు. వేద భాష్య పరీక్షలు నిర్వహించి, యువ పండితుల్లో ఎంతో ఆసక్తిని పెంచారు. ఉత్తీర్ణులైన వారిని తగు విధంగా సత్కరించారు.

ఒకసారి స్వామివారు యాత్రలో భాగంగా మా గ్రామానికి వచ్చినప్పుడు, “న్యాయ శాస్త్రంలో ఎంతో పాండిత్యాన్ని గడించిన నీవు ఇక అద్వైత వేదాంతం తత్వంలో అత్యుత్తమ గ్రంథమైన అద్వైత - సిద్ధిని చదువు” అనడంతో మరలా నా అధ్యయనం మొదలైంది.

స్వామివారు సన్యసించగానే ఆహారం విషయంలో సన్యాసి పాటించాల్సిన నియమాలను అత్యంత కఠినంగా పాటించేవారు. మనస్సు మరియు జ్ఞాపకశక్తి విషయంలో అది దోహదకారి అన్న సూత్రం ఆధారంగా స్వామి వారు తమ ఆహార అలవాట్లను కఠినతరం చేశారు.

సన్యసించిన తరువాత సన్యాసి ఇతరములైన సంభాషణలను విడిచిపెట్టాలి అనే అర్థమిచ్చే “అన్యో వచో విమున్చత అత ముని” అన్న శృతి వాక్యాన్ని అనుసరించి స్వామివారు ఎప్పుడో నాలుగు మాటలు మాత్రమే మాట్లాడుతూ, తక్కిన సమయం అంతా మౌనంగానే ఉండేవారు.

స్వీయ క్రమశిక్షణ పాటించడం వల్ల ఎంతో జ్ఞానాన్ని సంపాదించడంతో పాటు, కోరికలను ఈడేర్చే శక్తిని కూడగట్టుకున్నారు.

1992 జూన్ నుండి నేను చాలా నీరసించిపోయి, పూజాదికాలు, విద్యార్థులకు పాఠం చెప్పడం వంటి రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. నా స్వరం కూడా బలహీనంగా, పేలగా మారిపోయింది. అప్పుడు నేను ఆదిశంకరుల బ్రహ్మసూత్ర భాష్యాలపై భారతీయ తర్క పధ్ధతిపై ఆధారంతో చిన్న వ్యాఖ్యానం వ్రాసే పనిలో ఉన్నాను. ‘శంకర భక్త జన సభ’ వారి ఆధ్వర్యంలో దాన్ని ముద్రించాలని శ్రీ వైద్యనాథ ఆయర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.

1992 సెప్టెంబర్ 6 నుండి కంచిలో జరుగుతున్న అద్వైత సభలో పాల్గొంటున్న పండితులకు, పరమాచార్య స్వామివారికి ఈ పుస్తకాన్ని ఇవ్వదలచి కంచికి బయలుదేరాను. ఆరోజు నేను ఇంకా నీరసించిపోయి, నేను ఇచ్చిన వాక్యార్థము జీర గొంతుకతో చెప్పడం వల్ల అక్కడున్నవారెవరికి సరిగ్గా వినబడి ఉండదు. సాయంత్రం నేను పరమాచార్య స్వామి వద్దకు వెళ్లాను. ఆ పుస్తకాన్ని స్వామివారికి ఇచ్చి, ప్రదక్షిణ నమస్కారం చేసి, స్వామివారి దివ్య పాద కమలాలను అత్యంత భక్తితో నా తలపై ఉంచుకున్నాను. మనోహరమైన చిరునవ్వుతో స్వామివారు నన్ను అనుగ్రహించి ఆశీర్వదించారు. అంతసేపూ, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కూడా అక్కడే ఉన్నారు. స్వామి వారు నన్ను ఆశీర్వదించి, “చాలా కాలం తరువాత, మేము ఈరోజు పరమాచార్య స్వామివారి నవ్వును చూశాము” అని చెప్పారు.

మరుసటిరోజు నుండే నా ఆరోగ్యంలో మార్పు కనబడి త్వరలోనే స్వస్థత చేకూరింది. నేను ఇప్పుడు మంచి స్వరంతో పాఠాలు చెప్పగలుగుతున్నాను, చిన్న చిన్న దూరాలు కూడా నడవగలుగుతున్నాను.

“శ్రీ చంద్రశేఖర గురో శతాబ్ది అంతర జీవనే కార్యో అనుగ్రహ ఇతి ఏవ శంకరం ప్రార్థయే సదా”

శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గురుదేవులకు మరో వంద సంవత్సరాల జీవితాన్ని ప్రసాదించాలని శ్రీ ఆదిశంకర భగవత్పాదులని వేడుకుంటున్నాను.

--- జి. సుబ్రహ్మణ్య శాస్త్రి. “kamakoti.org” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
*****

*శుద్ధ భక్తికి ముగ్ధుడైన పురి జగన్నాథుడు*

[కళ్ళలో ఆనందభాష్పాలు తెప్పించే కృష్ణుడి లీల]     

బంధు మహంతి అతని భార్య , ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక 2 రోజులు అయ్యింది. వర్షాలు లేక , కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒడిషాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య వున్న జాజ్పూర్ లో భిక్షమెత్తుకొని , వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను , తన భార్య ఇంకా మిగిలివున్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధు మహంతి.

భార్య కంట తడిపెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు

*''ఏడ్చకు. నాకు పురి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు. చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు. మనకూ అతను సహాయం చేస్తాడులే''*.

ఒకరోజు భార్య

*''మనం మీ  స్నేహితుడి దగ్గరికెళ్ళి మన దీనావస్థను చెప్పుకొందాం. ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు ''*

అంటే బంధు మహంతి భార్య  పిల్లల్ని తీసుకొని  144 కి.మీ. దూరం లో వున్న పురి నగరానికి బయలుదేరాడు. మధ్య దారిలో అడవి వస్తుంది.

1530 వ సంవత్సరం లో నాలుగురోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పురి నగరం చేరాడు. రాత్రి అయ్యింది.

*''ఇపుడు నా స్నేహితుడు నిద్ర పోతుంటాడు. నిద్రా భంగం చేయడం మంచిది కాదు. ఉదయం ఆయన ఇంటికి వెళదాం''*

అన్నాడు బంధు. ఆమె సరే అంటూనే

*''ఇపుడు పిల్లలకు తినడానికేమీ లేదు. వాళ్లు ఆకలికి ఏడుస్తున్నారు''*

అని అంటే అపుడు బంధు

*''చూడు , మనం ఇపుడు పురి జగన్నాథుడి మందిర ప్రాంగణంలోవున్నాం. గుడి తలుపులు మూసేసారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం"*

అంటూ భార్యా పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు . ఆరాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో వుంది : 

*''ప్రభూ , నేను నీ భక్తుడిని . నీవు తప్ప నాకు ఎవరు దిక్కు ? నేను కటిక పేదవాడిని. నేను ఆకలితో వున్నాను.అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య , పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులూ నా భార్యకు ' నాకో స్నేహితుడున్నాడు , అతను మనకు సహాయం చేస్తున్నాడు ' అని చెపుతూ వస్తున్నాను. కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడని. ఇపుడు వాళ్ళ ఆకలి తీరలేదు , ఏ సహాయం అందలేదు అనుకో , ఆమెకు నీవు వున్నావు అనే విశ్వాసం పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీమీద నమ్మకం పెట్టుకొన్న ఆమెను నిరాశ పరచొద్దు. నీవు వున్నావు , నీవు ఇదంతా చూస్తున్నావు. ఇది నా నమ్మకం. ఆతరువాత నీ ఇష్టం !''*

వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకొన్నారు. మధ్యరాత్రి అయ్యింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో వున్నాడు.బంధు మహంతి భార్య కళ్ళు మూస్కొన్నది కానీ నిద్రపట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చొంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకొన్నది. ఆయన వెళ్ళిపోయాడు.  ఆమె బంధును, పిల్లల్ని నిద్రలేపి

*'ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు'*

అని చెప్పింది. బ్నధు అన్నాడు

*'నేను చెప్పాను కదా , నా స్నేహితుడు చాలా మంచివాడు అని. అతనే పంపివుంటాడు'*

ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని , ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్ర పోయారు.

కథ అయిపోయిందా ? లేదు . ఇపుడు మొదలౌతుంది.

తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరచి , స్వామి విగ్రహానికి నీళ్ళతో అభిషేకించి , అలంకరించబోతుంటే అక్కడుండాల్సిన బంగారు పళ్లెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది.   ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం వుండటాన్ని చూసి , అధికారులకు చెప్పాడు. వాళ్ళు అర్చకులతో కలిసివచ్చి బంధును పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధు  ఏమీ మాట్లాడటం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో

*'నేను దొంగను అని వీళ్లు నన్ను కొట్టినంతమాత్రాన , నీపై నాకున్న నమ్మకం పోతుందా ? నీవు వున్నావు , ఇదంతా చూస్తున్నావు'*

అని జగన్నాథుడైన  కృష్ణుడితో అంటున్నాడు.  అతని భార్య మాత్రం ఏడ్చుకొంటూ

*'ఆయన్ని కొట్టకండి. ఆయనకు ఏమీ తెలియదు. నిన్నరాత్రి ఒక  బ్రాహ్మణుడు వచ్చి ఈపళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు. మేము దొంగలం కాదు'*

అని  అంటూన్నా వాళ్ళు వదల్లేదు. బంధును తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది.

రాత్రి అయ్యింది. పురి నగరంలోవున్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది.

*''అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే , ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా ? అతను నాకు నిజమైన భక్తుడు. అతను నిరపరాధి. అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే''*

అని స్పష్టంగా ఎవరో చెప్పారు.

ఆయన కాక ఇంకెవరు చెప్పివుంటారు ?

ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథమందిరానికి వెళ్ళి , అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడివారు రాజుకు చెప్పారు. వారినీ అక్కడికి తీసుకురండి చెప్పి , స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్ళి , తాళాలు తీయించాడు. ఆ తరువాత ఆయన చేసిన పని అక్కడున్నవారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఒడిషా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు ,  బంధు మహంతి కాళ్ళకు సాష్టాంగ ప్రమాణం చేసాడు. అంతే కాదు , అక్కడిక్కడే బంధు మహంతిని పురి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు. అదొక్కటే కాదు , బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ  దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కులు కల్పించాడు.ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంటపనిని నిర్వహిస్తున్నారు.   

*---నమ్మక బాగుపడినవారు లేరు. నమ్మి చెడినవారు లేరు---*
*****
నేటి మనసులోని
మాటల ముత్యాలు.

సహనం కొండంత సమస్యను కూడా క్రిందికి తెస్తుంది..
కోపం సమస్య చిన్నదైనా కొండంతపెద్దది చేస్తుంది..
సహనం మనిషికి గుర్తింపునిస్తే కోపం మనిషిని మనసుకి దూరం చేస్తుంది...

ఒక్కసారి ఆలోచించండి.
ప్రతి మనిషి కి సమస్య వుంటుంది.
ఓడిపోయామని,
జీవితంలో ముందుకు వెళ్ళలేక పోతున్నామని అధైర్యపడకండి.
మనసుంటే మార్గం వుంటుంది,
అలాగేసహనం వుంటే సర్దుబాటు వీలవుతుంది.

అలోచించే ఆయుదాన్ని కోల్పోకండి.
మీమ్మల్ని  కష్టకాలంలో కూడ ముందుకు నడిపించేది అదే...

ప్రశాంతంగా ఉన్న..
జీవితమనే కొలనులో ఎవరైనా, అన్యాయంగా అబద్దాలతో నిందలనే రాయిని వేసినప్పుడు
ఆరోపణలు చేసినప్పుడు
కేవలం ఆ సమయంలో
అప్పుడు మాత్రమే అక్కడ ఉన్న ఆ నీటి ప్రశాంతతను ఆ రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు
కానీ, కాసేపు తరువాత,
నీరు తేరుకుని నిర్మలంగా,
శుభ్రంగా, స్వచ్ఛంగా,
ప్రశాంతంగా కనబడుతుంది..
ఉంటుంది కూడాకానీ,
నిందలు వేసినవారు,
అందరి దృష్టిలో, మనస్సులో,
ఆ రాయిలా,
ఆ నీటి కొలనులో
శాశ్వతంగా ఎప్పటికీ అడుగునే    
ఉండిపోతారు!

నీకు ఏమి ఇవ్వాలో
తెలిసిన ఆ దేవుడికి
ఎలా ఇవ్వాలో కూడా తెలుసు
నీకు ఆయువును పోసిన
ఆ దేవుడికి
నీ ఆపదను తొలగించడం
కూడా తెలుసు అందుకే...

కష్టం వచ్చిందని కంగారుపడకు
సుఖాలు రాగానే సంబరపడకు
నీలో భక్తి పెరిగితే...
దేవుడిని చూడాలనే...
కోరిక ఉంటుంది.
నీలో దానగుణం పెరిగితే...
ఆ దేవుడికే..
నిన్ను చూడాలన్న
కోరిక ఉంటుంది.
****

ఆత్మ సాక్షాత్కారం.

ఆగమములలో ‘ సర్వజ్ఞానోత్తర ఆగమము ‘ సుప్రసిద్ధము. అందులో  ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము.   అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.  

ఈ ప్రకరణం అంతా,  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి  పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది.  దీనిని 1933  లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.   తెలుగులో శ్రీ పోలూరి హనుమజ్జానకీరామశర్మగారు  వ్రాసిన వ్యాఖ్యాన సహాయంతో, మనం చెప్పుకుందాం.

దీనిలోమొత్తము 62  శ్లోకాలు వున్నాయి.  శ్రద్ధగా, నిదానంగా రోజుకు కొంత మననం చేసుకుందాం.

శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

శ్లో.  ఆధాన్యం సంప్రవక్ష్యామి ఉపాయం తత్త్వతో గుహ  /
      ఆగ్రాహస్యాపి సూక్ష్మస్య సర్వగస్య  తు నిష్కళం //   1 .

గుహా  ( సుబ్రహ్మణ్యా ) ! సూక్ష్మమై అంతటా వ్యాపించివున్న ఆత్మ అగ్రాహ్యం. అనగా తెలుసుకోలేనిది.  అయినప్పటికీ, దానిని వున్నది ఉన్నట్లు గ్రహించడానికి నిష్కళమైన  ఇంకొక ఉపాయము చెబుతున్నాను.

వివరణము :  కుమారస్వామికి గుహుడు అనే పేరుకూడా వున్నది. గుహనమనగా రక్షించుట. గుహుడనగా రక్షించేవాడు.  జ్ఞానోపదేశం చేత సంసారభీతినుండి ముముక్షువులను రక్షించేవాడు అని కూడా గ్రహింపవచ్చును.  

అణుశక్తి కన్నా సూక్ష్మంగా ఆత్మ విశ్వమంతా వ్యాపించి ఉన్నది.  దానిని ఇంద్రియముల చేత, మనస్సు చేత గ్రహించుటకు వీలుకాదు.   అందువలన అది అగ్రాహ్యము.  మరి ఏ ఉపాయంతో గ్రహించాలి ?   

బహిర్ముఖమై ప్రపంచములోని దృశ్యములను, విషయములను గ్రహించి ప్రవర్తించే ఇంద్రియాలకు, మనస్సుకు అది అగ్రాహ్యమే.  అదే మనస్సును ఇంద్రియములనుండి వెనుకకు మరల్చి శుద్ధమై ఏకాగ్రమై ఉంచితే,  అప్పుడు మనస్సు గ్రహించే స్థితిలో వుంటుంది. 

కళలు ప్రదర్శించనిది నిష్కళము.  కళ అనగా అంశము లేదా అంగము.    యోగసాధనలో యమము, నియమము మొదలైన అంశములు సాధనకు ఉపయోగ పడతాయి.  జపము, ధ్యానము, పూజ, సంకీర్తన మొదలైన అంగములు  భక్తి మార్గంలో ఉపయోగపడతాయి.   అయితే,  ఆత్మ గురించి తెలుసుకోవాలంటే, నిర్దిష్టమైన అంగములు అనగా కళలు ఏవీ లేవు.   అందుకని ఈ ఉపాయము నిష్కళము.

స్వస్తి.
శివానుగ్రహంతో, మరికొంత రేపు.
******
ప్రాంజలి సుమాంజలి కథలు
సేకరణ.. మల్లాప్రగడ

మోక్షం అనే పదం దాదాపు అందరూ వినేఉంటారు. ఏదో ఒక సందర్భంలో హమ్మయ్య మోక్షం కలిగిందని అనుకుంటారు. ఇంతకీ మోక్షం అంటే ఏంటి..అదెలా లభిస్తుందో??
మోక్షం ఎవరికి తొందరగా లభిస్తుంది!
త్రిలోకసంచారి అయిన నారదుడు ఓసారి భూమ్మీద ఉన్న విష్ణుభక్తులను పలకరించేందుకు వెళ్లాడు. ఆయన ముగ్గురు వ్యక్తుల్ని కలిశారు...వారిలో మొదటి వ్యక్తి ఓ ముని..

నారదుడు-ముని
నిత్యం హరినామస్మరణలో మునిగితేలే మునిదగ్గరకు వెళ్లాడు. నారదుడిని చూసిన ముని...‘అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు. స్పందించిన నారదుడు శ్రీ మహావిష్ణువు బాగానే ఉన్నారు, వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటానని బదులిచ్చారు నారదులవారు.‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో స్వామివారిని అడగండి అన్నాడు.సరేనని ముందుకు సాగిన నారదుడు ఆ తర్వాత చెప్పులుకుట్టే వ్యక్తికి కనిపించాడు.

నారదుడు-చెప్పులు కుట్టేవాడు
‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. స్వామివారు ఎలా ఉన్నారు,వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు. ‘స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు. ‘అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు’ అన్నాడు. సరేనన్న నారదుడు వైకుంఠానికి తిరుగుపయనమయ్యారు.

శ్రీమహావిష్ణువు-నారదుడు
వైకుంఠంలో స్వామివారి దగ్గరకు వెళ్లిన నారుదులవారు..తాను భూలోకంలో కలసిన వ్యక్తుల గురించి చెప్పి వారి సందేహాలు ముందుంచారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నారనంటే ‘నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి. కానీ ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తికి మాత్రం ఇదే చివరి జన్మ’ అన్నారు. ఆశ్చర్యపోయిన నారదుల వారు .. నిత్యం హరినామస్మరణలో మునిగితేలే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ జీవనం గడుపుతున్న చెప్పులుకుట్టే వ్యక్తికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటనే సంశయంలో ఉండిపోయారు. ఇది గమనించిన శ్రీహరి..ఈ సారి నువ్వు వారిద్దరినీ కలసినప్పుడు ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు ‘ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపిస్తున్నారని చెప్పు..వారిలో ఎవరు గొప్ప భక్తులో తెలుస్తుందంటారు.
భూలోకానికి తిరిగి బయుదేరి వెళ్లిన నారదుడు మళ్లీ ఆ ఇద్దర్నీ కలుస్తారు. ఎప్పటిలానే స్వామివారు ఏం చేస్తున్నారని అడిగితే..శ్రీహరి చెప్పమన్న సమాధానమే చెబుతారు నారదులవారు. అప్పుడు ఎవరి స్పందన ఎలా ఉందంటే...
ముని:‘భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు’ అన్నాడు ముని చిరునవ్వుతో.
చెప్పులుకుట్టేవ్యక్తి : ‘మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!’ అన్నాడు.
నారదుడు: స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!
చెప్పులుకుట్టేవ్యక్తి: ‘భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి. ఈ మర్రి పండులో వేల గింజలున్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందా… ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా’
పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం చెప్పులుకుట్టే వ్యక్తికే ఎందుకు ముందుగా వస్తుందో నారదుడికి అర్థమైంది...

ఇక్కడ మోక్షం అంటే..భగవంతుడు-భక్తుడు అని కాదు..మీరు నమ్మిన సిద్ధాంతం కావొచ్చు, మీరు చేస్తున్న పని కావొచ్చు. దానిపై పూర్తిస్థాయిలో విశ్వాసం ఉంటే వారు అందులో నూటికి నూరు శాతం సక్సెస్ అవుతారు (మోక్షం పొందుతారు) అని అర్థం. 
మనుషుల్లో మూడు రకాల వాళ్లుంటారు. ఐహిక సుఖం కోరుకునేవారు, పరం చాలనుకునేవారు, ఇహపర సుఖాలు రెండూ కోరుకునేవారు. పరసుఖం అంటే మోక్షం. మోక్షం కావాలని కోరుకున్నా అది అందరికీ ప్రాప్తించదు. ఎన్నేళ్లు సాధన చేసినా, తపస్సు చేసినా రుషులందరికీ మోక్షం లభించలేదు. అందుకు పూర్వజన్మ సుకృతమూ ఉండాలి. ఈ జీవితంలో చేసే అవిరళ కృషీ ఉండాలి.
భారతీయ దార్శనికక్షేత్రంలో మోక్షం అద్వితీయమైన పరమార్థం. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మచింతనలోను కనిపించని ప్రాధాన్యం మోక్షానికి మన సనాతన ధర్మచింతనలోనే గోచరిస్తుంది. దేశంలోని సర్వ సంప్రదాయాల దర్శనమిది. చింతన అనేది అన్ని రకాలైన సత్యాన్వేషణకు పునాది. జీవితంలోని అన్ని లోపాలను సవరించి, దుఃఖాలనుంచి విముక్తి కలిగించే మార్గమే చింతన. అప్పుడే శాశ్వతానందపథం గోచరిస్తుంది. అదే మోక్షం. చతుర్విధ పురుషార్థ ఫలాల్లో మోక్షమే అగ్రేసర స్థానంలో నిలబడి ఉంది. మానవుడి చరమలక్ష్యం మోక్షప్రాప్తి. భారతీయ తత్వదర్శనంలో మోక్షం పరమోత్కృష్ట మూల్యం, సర్వశ్రేష్ఠ పురుషార్థం. దార్శినికులు ఆస్తికులు, నాస్తికులుగా విభిన్న అభిప్రాయాలు కలవారుగా ఉన్నప్పటికీ, భారతీయ సంప్రదాయాలన్నీ ఏకగ్రీవంగా మోక్షాన్నే సమర్థిస్తాయి. జీవితానికి చరమలక్ష్యంగా అంగీకరిస్తాయి. మోక్షం ఆత్మకు సంబంధించింది. నాస్తిక సంప్రదాయాన్ని అనుసరించిన బౌద్ధ దర్శనం కూడా మోక్ష సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా సమ్మతించింది. మోక్షానికి బౌద్ధం 'నిర్వాణం' అని పేరు పెట్టింది. అన్ని బంధాలు, దుఃఖాలు తీరిపోవటమే నిర్వాణం. మోక్షేచ్ఛకు నిర్వచనం కూడా దాదాపు అదే. జైనమతమూ మోక్ష సిద్ధాంతాన్నే చరమ లక్ష్యంగా భావిస్తుంది. మోక్షప్రాప్తికి సమ్యక్‌ జ్ఞానం, సమ్యక్‌ దర్శనం, సమ్యక్‌ చరిత్ర ఆవశ్యకమని చెబుతుంది.
  మోక్షం నిరానందస్థితి. ఇది తత్వజ్ఞానం వల్ల లభిస్తుంది. న్యాయ ధర్మ సిద్ధాంతాల అనుసారం తత్వజ్ఞానమంటే ఆత్మను శరీరం, మనసు ఇంద్రియాల నుంచి వేరుగా తెలుసుకోవడం. ఈ జ్ఞానం పఠన, శ్రవణ, మనన విధి ధ్యాసలవల్ల కలుగుతుంది. ఇవే మోక్షమార్గాలు. మోక్షం కోరుకునే జాతిలో ఏ అరిష్టమూ, అశుభమూ చోటు చేసుకోలేదు. విశ్వశాంతికి అటువంటి జాతే సర్వదా సహకరిస్తుంది.
   సాంఖ్య-యోగ దర్శనాలను అనుసరించి మోక్షమంటే కైవల్యం. దుఃఖం నుంచి సర్వులకూ విముక్తి కలిగించేది అదే. కైవల్యంలో సుఖం కూడా ఉండదు. అంటే అది శుద్ధచైతన్యావస్థ. ఈ స్థితి జ్ఞానంవల్లనే సిద్ధిస్తుంది. మోక్షసాధనాల్లో సర్వోత్కృమైన సాధనం భక్తే. భక్తి వల్లనే అంతర్యామి అనురాగం, ఆశ్రయం లభిస్తాయి. అద్వైతం జ్ఞానానికి ప్రాధాన్యమిస్తుంది. విశిష్టాద్వైతం భక్తికి ప్రాముఖ్యమిస్తుంది.

   స్థూలంగా మోక్షం అంటే సమర్పణభావం. ఇది అంత సులువు కాదు. అది ఒక పావన భావన. అందులో నిరహంకారం, వినయం, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం నిండుగా ఉండాలి. అత్యంత ప్రియతముణ్ని ఆత్మసమర్పణ చేసుకొమ్మంటాడు వాసుదేవుడు. ఆ ప్రియతముడే అర్జునుడు.
  అత్యంత దుర్లభమైన ఈ మానవ జన్మ లభించాక కూడా మోక్షప్రాప్తికి యత్నించని, తపించని మానవుడు మూఢుడు. జడుడు, మహాపాపి. పాపానికైనా, పుణ్యానికైనా ఈ శరీరం సహకరించాల్సిందే కద! అందుచేత సత్కర్మల కోసమే ఈ శరీరాన్ని స్వస్థతతో కాపాడుకోవాలి. ముక్తి కోసం ధ్యానయోగాల్ని, ధ్యానయోగాల కోసం జ్ఞానాన్ని, జ్ఞానం కోసం ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. ధర్మాచరణ కోసం శరీరాన్ని ఆరోగ్యవంతంగా సంరక్షించుకోవాలి. కనుక మోక్షప్రాప్తికి శరీరారోగ్య పరిరక్షణ అత్యావశ్యకం, అనివార్యం.
   'ఇది నాది' అనుకుంటే మనిషి బంధాల్లో చిక్కుకుంటాడు. 'ఇది నాది కాదు' అనుకుంటే మోక్షార్హుడవుతాడు. సాంసారిక వాసనలతో నిండి ఇంద్రియచాపల్యం కలిగించే కర్మలు చేస్తున్న మానవుడికి పరమ తత్వజ్ఞానం అవగాహన కాదు. త్రికరణ శుద్ధిగా పవిత్రుణ్ని చేసే విద్యే విద్య. అటువంటి విద్యనే సాధకుడు హస్తగతం, మనోగతం చేసుకోవాలి. దాన్ని ఆచరణతో సమన్వయపరచుకోవాలి. దాన్ని జీవనలక్ష్యంగా స్వీకరించాలి. అందుకు సద్గురువు సహకారం అనివార్యం. ప్రాణ, మానమోహాలు వీడి, మమతాను బంధాలు త్యజించి, ధర్మవ్రతుడై ఏకాగ్రతతో ప్రణవం జరిపించి, జితేంద్రియుడై, ఐహిక శృంఖలాల నుంచి విముక్తి పొందడమే మోక్షం. అటువంటి మోక్షానికి మనసు దర్పణమై ప్రకాశిస్తుంది. అందులో విశ్వపురుషుడి ప్రతిబింబమే ప్రభాసిస్తుంది. ఆ అలౌకిక దర్శనానుభూతే మోక్షం!
****

అమరశిల్పి #జక్కన్న 🙏🙏🙏

మనకు సినిమా ద్వారా పరిచయమైన పేరు... ఇతని గురించి ఏ చరిత్ర పుస్తకమూ మనకు పాఠాలు నేర్పలేదు....పాశ్చాత్యులు కళ్ళు తెరువక ముందే... విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లో ... డ్రిల్ బిట్ లేకుండా ఇంత అద్భుతాన్నీ సుసాధ్యం చేసిన మన అమరశిల్పి జక్కన్న చెక్కిన శిల్పాలు మనకు ఎన్నో విషయాలు తెలుపుతున్నాయి.

జక్కన్న ఎందుకు అమరశిల్పి అయ్యాడో #బేలూర్ #హలెబీడు దేవాలయ శిల్పాలు చూసాక కానీ అర్థం కాలేదు..మనకు తెలిసినంత వరకు ఒక శిల్పం అంటే… ఒక దేవతా మూర్తి అవయవాలన్నీ సక్రమంగా రూపొందించి చుట్టూ ఒక ఆర్చి లాంటిది పెట్టేస్తే సరి… ఇక శిల్పం పూర్తయినట్టే. హలేబీడు , బేలూరు లోని శిల్ప సంపదను చూస్తే అవి ఒక్క అంగుళం కూడా వదలకుండా లతలు, అల్లికలతో, విచిత్రమైన డిజైన్లతో నిండి ఉండడం స్పష్టంగా చూడవచ్చు. ఆ స్త్రీ మూర్తుల మెడలో అలంకరించిన హారాలు, చెవి రింగుల్లోని పూసలతో సహా… చేతి వేళ్ళకు వుండే గోళ్ళను, ఆఖరికి జుట్టు కొప్పులోని వెంట్రుకలను కూడా శిల్పంలో స్పష్టంగా చూపించడం అంటే… మనుషులకు ఎవరికైనా సాధ్యమయ్యే పనే కాదు... ఒక చిన్న పొరపాటు జరిగినా చెక్కిన శిల్పం అంతా వృథా అయిపోయే శ్రమ తీసుకుని, పొరపాటుకు తావు లేకుండా కొన్ని వందల కొద్దీ శిల్పాలు ఎలా చెక్కగలిగారో ఆ రోజుల్లో... … అవి కూడా ఇంకెవరికీ అనుకరించడానికి కూడా వీలు లేనంత అద్భుతంగా చెక్కిన ఆ మహానుభావుని మేథస్సు, సాధన, కళా నైపుణ్యం, అంకితభావం అనిర్వచనీయం... 🙏🙏

దేవలోకంలో నివసించే ఏ యక్షుడో, గంధర్వుడో శాపవశాన ఇలా కొన్నాళ్ళు భూమిపైకి వచ్చి... ఇలాంటి వాడు ఒకడు ఈ భూమిపై, ఈ మనుషుల్లో కలిసి తిరిగాడని మనం నమ్మడానికి గుర్తుగా ఈ శిల్పాలు చెక్కి వెళ్లిపోయాడని అనిపిస్తుంది. మొనాలిసాను ఒక్కదాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు డావిన్సి గురించి ప్రపంచమంతా డబ్బా కొడుతున్నారు, సినిమాలు తీస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు... పికాసోను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. మరి మనలో కలిసి తిరిగిన ఒకడు... మన ఊరి చావిట్లో పడుకుని, మన ఇంట్లో చద్దన్నం తిని, మన నేలపై అతి సామాన్యంగా తిరిగిన ఒకడు ఇంతటి అసామాన్యుడని ఈ రాళ్ళకు కూడా అర్థమై అతనికి దాసోహం అన్న తరువాత కూడా మన మట్టి బుర్రలకు ఎందుకు తెలియడంలేదు..?ఒప్పుకున్న ఒప్పుకోకున్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని...   ఎలుగెత్తి చాటరా జక్కన్న శిల్పాల్ని👌🙏🙏

జక్కన్న ఆచారి (Jakkanna) క్రీ.శ. 12వ శతాబ్దంలో కర్ణాటకలోని హోయసల రాజులకాలం నాటి శిల్పి. కర్ణాటక రాష్ట్రం, హసన్ జిల్లా బేలూరు మరియు హళిబేడులో గల ఆలయాల శిల్పకళ జక్కన్నచే రూపుదిద్దుకున్నదే. బేలూరు చెన్నకేశవ ఆలయంలో గల శిల్పాలు ఇతని కళావిజ్ఞకు తార్కాణం.

జక్కనాచారి కర్ణాటకలోని తుముకురు దగ్గర కైదల అనే గ్రామంలో జన్మించాడు. వీరి జీవితం అంతా ప్రేమ మరియు కళలకు అంకితం చేసిన ధన్యజీవి. ఇతడు నృపహయ అనే రాజు కాలంలో జీవించాడు. వివాహం చేసుకున్న అనతికాలంలోనే శిల్పకళ మీద అభిరుచితో దేశాటన కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. సుదూర ప్రాంతాలు ప్రయాణించి ఎన్నో దేవాలయాలు నిర్మించి శిల్పకళలో నిమగ్నమై భార్యను మరియు కుటుంబాన్ని మరిచిపోయాడు.

జక్కనాచారి భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది; అతడే ఢంకనాచారి. చిన్నప్పుడే శిల్పిగా తీర్చిదిద్దబడిన ఢంకన తండ్రిని వెదుకుతూ దేశాటనం మీద వెళతాడు. బేలూరులో అతనికి శిల్పిగా అవకాశం లభిస్తుంది. అక్కడ పనిచేస్తున్న సమయంలో జక్కన చెక్కిన ఒక శిల్పంలో లోపం ఉన్నదని ఢంకన గుర్తిస్తాడు. కోపగించిన జక్కన్న లోపాన్ని నిరూపిస్తే కుడి చేతిని ఖండించుకుంటానికి ప్రతిజ్ఞ చేస్తాడు. పరీక్షించిన తరువాత ఆ శిల్పంలోని లోపం నిజమైనదేనని నిరూపించబడుతుంది. ప్రతిజ్ఞా పాలన కోసం జక్కన్న తన కుడి చేతిని తానే నరుక్కుంటాడు. ఆ సమయంలోనే వీరిద్దరు తండ్రీకొడుకులని గుర్తిస్తారు. ఢంకనా తండ్రిని మించిన తనయునిగా ప్రసిద్ధిపొందుతాడు.

అనంతరం జక్కనాచారికి క్రిడాపురలో చెన్నకేశవ దేవాలయం నిర్మించమని ఆనతి లభిస్తుంది. అది పూర్తయిన తరువాత అక్కడి దేవుడు అతని కుడి చేతిని తిరిగి ప్రసాదిస్తాడని చెబుతారు. ఈ సంఘటన ప్రకారం, క్రిడాపురను కైడల అని వ్యవహరిస్తున్నారు. కన్నడంలో 'కై' అనగా చేయి అని అర్థం.

ఇంతటి ప్రసిద్ధిచెందిన కళాకారుని జ్ఞాపకార్ధం కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం అదే రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ శిల్పులు మరియు కళాకారులకు జక్కనాచారి అవార్డులు ప్రదానం చేస్తుంది.

         సేకరణ

*🌻ధర్మం - విధి🌻*
                         

* ఒకప్పుడు, అత్యంత సద్గుణవంతుడైన పెద్దమనిషి తన కుటుంబంతో సహా తీర్థయాత్రకు బయలుదేరాడు.

* అనేక మైళ్ల దూరం ప్రయాణించిన తరువాత, కుటుంబం మొత్తం దాహంతో పరితపించారు.  అవి తీవ్రమైన వేసవి నెలలు కావడంతో నీరు ఎక్కడా కనిపించలేదు.  వారు వెంట తెచ్చుకున్న నీరు కూడా అయిపోయింది. పిల్లలు  దాహంతో అలమటిస్తున్నారు,అతని వద్ద ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం  లేకపోయింది.చివరి ప్రత్యామ్నాయంగా దైవాన్ని ప్రార్థించే సమయం వచ్చింది, "ఓ ప్రభూ!  దయచేసి ఈ పరిస్థితిని పరిష్కరించే భారం మీదే అని వేడుకున్నాడు.

* వెంటనే, అతను కొంత దూరంలో ధ్యానంలో కూర్చోని ఉన్న ఒక ఋషి ని చూశాడు. ఆ వ్యక్తి ఋషి వద్దకు వెళ్లి తన సమస్యను వివరించాడు.  ఆ ఋషి ఇక్కడ నుండి ఒక మైలు దూరంలో ఉత్తరాన ఒక చిన్న నది ప్రవహిస్తుంది, మీరు అక్కడకు వెళ్లి మీ దాహం తీర్చుకోవచ్చు అని అతనికి తెలియజేశాడు.

* ఇది విని ఆ వ్యక్తి చాలా సంతోషించి, ఋషికి కృతజ్ఞతలు తెలిపాడు. నడవలేని పరిస్థితిలోఉన్న తన భార్య , పిల్లలను అక్కడే ఉండమని చెప్పి, అతనే  స్వయంగా నది వైపు నీరు తీసుకురావడానికి వెళ్లాడు.

* అతను నీటితో తిరిగి వస్తుండగా, దారిలో విపరీతమైన దాహంతో ఉన్న ఐదుగురు వ్యక్తులు కనిపించారు, అతను చాలా ధర్మశీలుడైనందున, వారిని ఆ స్థితిలో చూడలేక పోయాడు,  దాహంతో ఉన్న వారికి తన నీటిని ఇచ్చి, తిరిగి నదికి వెళ్లాడు. అతను తిరిగి వస్తున్నప్పుడు మళ్లీ నీటి కోసం ఉక్కిరిబిక్కిరి అవుతున్న కొంతమంది వ్యక్తులను కలుసుకున్నాడు. మరోసారి, అతను తన నీటిని మొత్తం వారికి ఇచ్చాడు.

* అతను మూడవసారి నీరు తీసుకుని  కుటుంబాన్ని చేరే సమయానికి, వారందరూ తీవ్రమైన దాహార్తికి గురై, అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నారు.వారి ముఖాలపై నీరు చల్లి మేల్కొల్పడానికి చాలా ప్రయత్నించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అతను తీవ్రంగా ఏడ్చాడు, నిరాశతో ఋషి వద్దకు పరుగెత్తాడు. అతని పాదాలపై పడి దుఃఖిస్తూ, “మహర్షీ చెప్పండి, నా కుటుంబం ఈ స్థితిలో ఉండటానికి నేను ఏపాపం చేసాను? నేను ఆపదలోఉన్నవారికి  సహాయం చేసి, ధర్మబద్ధమైన పని చేసాను.  దయచేసి నా కుటుంబానికి సహాయం చేయండి స్వామి,” అని వేడుకున్నాడు.

* దానికి ఋషి, "ఓ సజ్జనుడా! నీవు నది నుండి నీళ్లు తెచ్చుకుంటూ, దాహంతో ఉన్న బాటసారుల కోసం నీ పాత్రను ఖాళీ చేసుకున్నావు. దీనివల్ల నువ్వు ఏమి ప్రయోజనం పొందావు చెప్పు?" అని అడిగాడు.

* ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు, "దాని నుండి నేను పొందే దాని గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు; ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా నేను ధర్మాన్ని పాటించానని భావించాను.

* ఋషి ఇలా అన్నాడు మీ బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు, అలాంటి నీతి, ధర్మాల వలన ఉపయోగం ఏమిటి? నీ స్వంత పిల్లలను, కుటుంబాన్ని కాపాడుకోలేని పుణ్యం వల్ల ఏమిటి లాభం? మీరు మీ ధర్మాన్ని నేను చూపిన మార్గంలో కూడా నెరవేర్చి ఉండవచ్చు కదా!

* ఆ వ్యక్తి ఆసక్తిగా ఎలా మహానుభావా?" అని అడిగాడు.

* దానికి ఋషి నీ కోసం నేను నీళ్లు ఇవ్వడానికి బదులుగా నదికి వెళ్లే మార్గాన్ని నీకు చూపించాను. మీరు కూడా, ఆ దారిన వెళ్లే వారందరికీ మార్గం చూపించి, వారిని నదికి నడిపించాల్సింది. ఆ విధంగా, మీ స్వంత కుటుంబంతో సహా అందరి దాహం తీరి ఉండేది. ఇతరుల కోసం ఎవరూ తమ స్వంత పాత్రను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు.అని   ఋషి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు తన దీవెనలు ఇచ్చి, అదృశ్యమయ్యాడు.

* ఆ వ్యక్తి తన గుణపాఠాన్ని నేర్చుకున్నాడు.స్వంత  బాధ్యతలను విస్మరించి, మంచి పనుల్లో పాల్గొనడం అంత ధర్మం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు.

* మీరు ముందుగా మీ విధులను నిర్వర్తించాలి, తద్వారా ఇతరులకు ధర్మ మార్గాన్ని ప్రేరేపించాలి , మార్గదర్శనం చేయాలి!

* ఎవరికైనా మంచి చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, భగవంతుని మార్గాన్ని, సత్య మార్గాన్ని చూపించటమే

******
పుల్లని దానిమ్మ పళ్ళు

అది నవంబర్ 1963. జగద్గురు శ్రీ కంచి కామకోటి పరమాచార్య తిరువిడైమరదూర్ దగ్గరలోని, కావేరీ ఉత్తర తీరాన ఉన్న కళ్యాణపురం అన్న చిన్న గ్రామంలో ఇరవైఅయిదు రోజులపాటు మకాం చేశారు.

ఒకరోజు ఉదయం తంజావూరు ఆనంద లాడ్జి యజమాని కె.యస్. గోపాలస్వామి అయ్యర్ నా వద్దకు వచ్చి, తనతో పాటుగా వచ్చిన మద్రాసు వ్యక్తితో కలిసి కళ్యాణపురంలో ఉన్న పరమాచార్య స్వామివారి దర్శనానికి రాగలవా అని అడిగారు. నేను వెంటనే ఆ అవకాశాన్ని కాదనకుండా వాళ్ళతో బయలుదేరాను.

మద్యాహ్నం మూడుగంటలప్పుడు మా కారు తిరువిడైమరదూర్ దగ్గరలోని విరకోలన్ నది వంతెన దాటగానే, దరిపక్కగా పెద్ద దంతాలతో ఉన్న శ్రీమఠం ఏనుగు కొబ్బరి ఆకులను తింటూ కనబడింది. శ్రీమఠం గోవులను నదిలో స్నానానికి తీసుకునివెళ్తున్నారు. పూజ సేవకులు ముందర ఉన్న ఇంటి అరుగుపై సేదతీరుతున్నారు. అక్కడ ఎక్కువ హడావిడి ఏమి లేదు. మఠం మేనేజరు మమ్మల్ని స్వాగతించి, దగ్గరలోని ఇంటిలో ఉన్న మఠం కార్యాలయానికి తీసుకునివెళ్లాడు.

అక్కడ మాతోపాటు వచ్చిన మద్రాసు పెద్దమనిషి మేనేజరుకు వంద రూపాయల నోట్ల కట్ట ఇచ్చి, దానికి సరిపడా రూపాయి చిల్లర తీసుకుని పెద్ద చెక్క తట్టలో పెట్టుకున్నాడు. కొన్ని బుట్టల్లో పళ్ళు, బెల్లం, చిన్ని డబ్బాల్లో మంచి కుంకుమపువ్వు, పెద్ద గంధపు చెక్క, కొన్ని స్వచ్చమైన కర్పూరం పొట్లాలు కూడా తెచ్చాడు. మేము అన్నిటిని రెండు వెదురు పళ్ళాలలో సర్దాము. అతను తీర్చిదిద్దిన కచ్చపంచలోకి మారి, నుదుటిపై, ఎదపై, చేతులపై వీబూధి రేఖలు దిద్దుకుని సిద్ధమయ్యాడు. ఇదంతా అతనికి అనుభవం లేనిదని తెలిసిపోతోంది.
అందరమూ పూజ జరిగే చోటుకి వెళ్ళాము. ఆ ఇంటి వెనుకవైపున ఉన్న గోశాలలో పరమాచార్య స్వామివారు ఉన్నారు. నేను ముందుగ వెళ్లి వీరి గురించి స్వామివారికి తెలిపాను.

స్వామివారు మౌనంగా తల ఊపారు. ఆ మద్రాసు పెద్దమనిషి, కె.యస్.జి ఇద్దరూ వచ్చి తెచ్చినవాటిని స్వామివారికి సమర్పించి, ముగ్గురమూ సాష్టాంగం చేశాము. స్వామివారు కె.యస్.జి ని గుర్తుపట్టి ఒక చిరునవ్వు నవ్వి, మహామహోపాధ్యాయ మన్నార్గుడి రాజు శాస్త్రి గారి మునిమనవడైన వై. మహాలింగ శాస్త్రి గారితో మరలా మాట్లాడడం మొదలుపెట్టారు. స్వామివారు, రాజు శాస్త్రి గారి దుర్జనోక్తినిరాస (చెడ్డవారి మాటలకు దండన) గురించి మాట్లాడుతున్నారు. అందులోని కొన్ని వాక్యాలను చెబుతూ మహాలింగ శాస్త్రి గారు సంభాషణను కొనసాగిస్తున్నారు. ఇలా ఒక అరగంట పాటు జరిగింది.

నేను కొంచం కలవరపడ్డాను. కె.యస్.జి నన్ను కూడా తీసుకువెళ్ళడానికి కారణం నేను స్వామివారికి చాలా దగ్గరని, తన మద్రాసు స్నేహితుణ్ణి స్వామివారికి పరిచయం చేసి వెంటనే పెద్ద పెద్ద ఆశీస్సులు ఇప్పిస్తానని. కాని ఇప్పుడేమో మమ్మల్ని పూర్తిగా విస్మరించారు స్వామివారు. వెనుకనుండి కె.యస్.జి నన్ను పొడుస్తున్నాడు. కాని నేను ఏం చెయ్యగలను. స్వామివారు చేస్తున్న చిన్న చిన్న వ్యాఖ్యలకు కూడా ఆ మద్రాసు వ్యక్తి పెద్దగా నవ్వుతున్నాడు, అలాగైనా స్వామివారు తనను చూస్తారని. మాకు మాత్రం చాలా ఆందోళనగా ఉంది.
గోశాల ద్వారం వద్ద ఎవరో తొంగిచూశారు. “వేదపురి, ఎవరది?” అని అడిగారు స్వామివారు. స్వామివారికి విసనకర్ర వీస్తున్న వేదపురి ద్వారం వద్దకు వెళ్లి, మయూరంలోని వల్లల్లార్ వీధి నుండి వచ్చిన ఒక శ్రౌతి గారిని పిలుచుకునివచ్చాడు. శ్రౌతి గారి చేతిలో ఒక చిన్న వెదురు బుట్ట, అందులో రెండు టెంకాయలు, కొన్ని అరటిపళ్ళు ఉన్నాయి. పెద్ద సామవేద పన్నం ఒకటి చదివి సాష్టాంగం చేశారు. అత్యంత వినయంతో, భక్తితో తన కుమార్తె వివాహం ఒక వేద విద్యార్థితో కుదిరిందని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు కావాలని ప్రార్థించాడు.

వెంటనే స్వామివారు, “మీ అమ్మాయి ఇంకా ఉన్నత పాఠశాలలో చదువుతున్నదని చెప్పావు. మరి ఈ పెళ్ళికి తన అన్గేకారం ఉందా?” అని అడిగారు.

“పెరియవా అనుగ్రహం వల్ల ఇప్పటికి మా ఇంట్లో పూర్వపు ఆచారాలనే పాటిస్తున్నాము” అని చెప్పారు శ్రౌతి.

ద్వారం వద్ద మరలా ఎవరో తొంగిచూశారు. వేదపురి ద్వారం వద్దకు వెళ్లి, మాట్లాడి తిరిగొచ్చాడు. “విల్లైనూర్ నుండి ముసలావిడ. ఆమె పెరియవా కోసం పుల్లని దానిమ్మ పళ్ళు తెచ్చింది. ఇదిగో పెరియవా” అని చెప్పాడు.

“ఇక్కడకు తీసుకుని రా”. వేదపురి ద్వారం వద్దకు వెళ్లి తిరిగొచ్చి, “అక్కడినుండే స్వామివారికి నమస్కారం చేసి తను వెళ్తానంటోంది పెరియవా” అని చెప్పాడు.
“తనను ఇక్కడకు రమ్మని చెప్పు”. ఆమె ద్వారం వద్ద కనబడి, నమస్కారం చేసి వణుకుతూ నిలబడింది.

మహాస్వామివారు చేతిలోకి ఒక పండును తీసుకుని, దాన్ని తిప్పుతూ, వై. మహాలింగ శాస్త్రితో మాట్లాడుతున్నారు.

ఇల్లైనూర్ వైద్యనాథ స్వామి గురించి చెబుతూ, “వైతా నీకు తెలుసా”. “అప్పట్లో ఒకసారి నాకు కడుపులో కొద్దిగా సమస్య వచ్చింది. ప్రముఖులు, మద్రాసు ఆయుర్వేద కళాశాల నటేశ శాస్త్రి నన్ను పుల్లని దానిమ్మ పళ్ళ రసం త్రాగమన్నారు. అది చాలా అరుదైన రకం. అది పుల్లగా ఉంటుంది కాబట్టి ఎవరూ దాన్ని పెంచరు. ఈ విషయం విన్న వైతా ఎక్కడెక్కడో తిరిగి మూడో రోజు కొన్ని పళ్ళు తెచ్చాడు”

“తరువాత తన ఇంటి మధ్యలో ఆ చెట్టును నాటి జాగ్రత్తగా పెంచాసాగాడు. దాన్ని ఇంటి వెనుకనున్న పెరడులో పెంచలేదు ఎందుకో తెలుసా, అక్కడ నాటితే ఆ చెట్టుకు ఇంట్లోని ఆహార పదార్థాలు అవీ వెయ్యడం వల్ల కలుషితం అవుతుందని, నేను తిననేమో అని. ఆ చెట్టుకు కాచిన కాయలన్నీ నాకే సమర్పించేవాడు. నేను వేరే ప్రదేశాలలో ఉంటే, ఎప్పుడైనా వాటిని ఉపయోగించుకునేలాగా ఈ అమ్మ వాటిని ఒక ప్రత్యెక విధానంలో ఎండబెట్టెది. వైతా లేడు. ఇప్పుడు అతని భార్య అప్పుడప్పుడు పళ్ళు తెస్తుంటుంది”.

“అరుదుగా దొరికేవాటికే విలువ ఎక్కువ. పురావస్తు తవ్వకాల్లో దొరికినవి ఇప్పుడు పనికిరానివైనా వాటికి విలువ ఎక్కువ. దొరికిన దాని కాలం ఎంత పాతదైతే అంత విలువ. ఉదార సంబంధ సమస్యలకు ఇప్పుడు ఎన్నో పరిష్కారాలు వస్తుండడంతో ఇప్పుడు ఈ పళ్లకు విలువ లేదు. కాని ఇది అరుదు కాబట్టి, విలువ ఎక్కువే. ఈ సందర్భంలో నాకు రామాయణం నుండి ఒక విషయం జ్ఞప్తికి వస్తోంది. హనుమంతుడు రావణుని రాజభవనంలో తిరుగుతూ, అక్కడున్న అరుదైన రాత్నాలనూ, అరుదైన కళాఖండాలను చూసి వాటిని రెండు రకాలుగా విభజిస్తాడు”

స్వామివారు కొద్ది క్షణాలు ఆ భాగాన్ని గుర్తుచేసుకోన్నారు.

“అవును. అది ఇలా ఉంటుంది.

య హి వైశ్రవణే లక్ష్మి!
య చ ఇంద్ర హరివాహనే!”

“రావణుడు కుబేరుని సంపదని, ఇంద్రుని సంపదని దోచుకున్నాడు. కుబేరుని సంపదలో ఉన్న బంగారము, వెండి, రత్నాలు మొదలైనవి విలువ కట్టి మొత్తం చెయ్యొచ్చు. కాని ఇంద్రుని సంపదలో ఉన్న వెలకట్టలేని, అరుదైన, పాట వస్తువులను వెలకట్టలేము. ఈ విషయాన్ని ‘హరిఅహన’ అన్న పదంలో అర్థచేసుకోవాలి. ఇంద్రుని గుర్రాలు పచ్చని రంగులో ఉన్నాయి. అవి చాలా అరుదైన రకం. వాటిని వెలకట్టి ఎక్కడా కొనలేము. అవి అపూర్వమైనవి. వాటిని పోలినవి కూడా ఎక్కడా దొరకవు. అటువంటి అరుదైనవే ఈ పళ్ళు కూడా”

అక్కడున్నవారికి ఎవరికీ ఈ ప్రభోదం ఎవరికోసమో అర్థం కావడంలేదు.

స్వామివారు వేదపురి వైపు తిరిగి, “ఇక్కడకు రా! మద్రాసు నుండి వచ్చిన పెద్ద మనసున్న ఈ పెద్ద మనిషి నాకోసం అపరిమితంగా తెచ్చాడు. అది ఒక మంచి పనికి ఉపయోగిద్దాం. లెక్కపెట్టవలసిన అవసరం లేదు. మొత్తం శ్రౌతి పైపంచెలో వెయ్యి. పెళ్ళికోసం అపరిమితమైన ధనం ఖర్చుపెట్టి ఉంటాడు. ఇది అతని అవసరం తీర్చగలదు” అని చెప్పారు.

సాధారణ సంభాషణకు ఎంతటి గొప్ప ముగింపు. మద్రాసు పెద్ద మనిషి గర్వం గాలిలో కలిసిపోయింది. ఒకేఒక చిన్న మాటతో అతణ్ణి స్వామివారు ఎంతో ఎత్తుకు చేర్చారు. కుమార్తె పెళ్ళికి లెక్కలేనంత ధనం సమకూరింది శ్రౌతి గారికి.

అది మహాస్వామి వారు అంటే

--- వి. స్వామినాథ ఆత్రేయ. “kamakoti.org” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Wednesday, 24 April 2024

 🙏


*దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం.*

 చిన్నపిల్లలే కాదు… నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.*GB

*మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం… "అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని*.

*మనకు భవవంతుని గురించి అవగాహనలేనప్పుడు, చెప్పడం చేతగానప్పుడు, మనం వాడే మాట అదే!*.

*కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు గదా!*

మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు.

తెలియని వారికి అలా చెప్పడం వల్ల వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.

*పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ… మనసుతో చేసే వ్యాయామం*…

*మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ…*

*"దీప ప్రజ్వలనం" అనేది "త్రాటకం" అనే యోగ ప్రక్రియ.*

*రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.*

*ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే నాలిక మొద్దుబారదు. అది నాలికకు ఎక్సర్‌సైజ్‌.* అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది,

*ధారణ శక్తి పెరుగుతుంది*. భాష మీద పట్టు పెరిగితే స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.

పూజ అంటే చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి.

*మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి.*

అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది…

*1. మూలవిరాట్* 🚩

భూమిలో ఎక్కడైయితే Electronic & Magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ "మూల విరాట్" ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు Catalyst గా పని చేస్తాయి.

*2. ప్రదక్షిణ* 🚩

మనం గుడి చుట్టు Clockwise Directionలో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన… ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు? పుణ్యక్షేత్రాలు Vedic Architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరంలోని "షఠ్ చక్రాలను" ప్రభావితం చేస్తాయి.

 *3. ఆభరణాలతో దర్శనం* 🚩

ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు… బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.

 *4. కొబ్బరి కాయ* 🚩

ఇది "స్వచ్ఛత"కు గుర్తు. పై 'టెంక మన 'అహంకారాన్ని'… దాన్ని పగలగొడితే వచ్చే 'కొబ్బరి' మన 'కల్మషం లేని మనసును'… అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.

 *5.మంత్రాలు* 🚩

ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే Neuronsని ఆక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం… అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి Neuronలను ఉత్తేజపరువస్తాయి.

*6. గర్భగుడి* 🚩

గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.

*7. అభిషేకం* 🚩

విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి… వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.

*8. హారతి* 🚩

పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి …హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి… దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.

*9. తీర్థం* 🚩

ఇందులో పచ్చకర్పూరం, తులసి, లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు.

*10. మడి* 🚩

తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కుiవగా తీసుకునే గుణం ఉంటుంది. అందుకే మడి.!

*ఇవన్నీ మూఢనమ్మకాలు చాదస్తాలు అనుకుంటున్నాం  కానీ పెద్దలు చెప్పే మాటల్లో ఎన్ని సత్యాలు ఉన్నాయో!🙋‍♂️*

మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ శర్మ......101

*****

*రొటీన్ జీవితం బోర్ కొడుతుందా ?😒అవలోకించండి .మన తెలుగు భాష కే చెందిన అవధానంలో .... అప్రస్తుత ప్రసంగాలు - సరదాగా* 😉


*ప్రశ్నికుడు*:- 

1 . రైలు పట్టాలకూ,

     కాలి పట్టాలకూ 

     అనుబంధం ఏమిటి?


*అవధాని:-*

  రైలు పట్టాల మీద వుంటుంది,

   కాలి మీద పట్టాలుంటాయి.


*ప్రశ్నికుడు*

2 . కనలేని స్త్రీమూర్తి ఎవరు?


*అవధాని:-*

    న్యాయస్థానములో వున్న

     న్యాయదేవత. 

     కళ్ళకు *గంతలు* కట్టి    

     వుంటారు కదా!


*ప్రశ్నికుడు*

3 . సోమవారాన్ని 'మండే'       అనెందుకంటారు?


*అవధాని*

ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాము కదా సోమవారం పొద్దున్నే

పనికెళ్లాలంటే ఒళ్ళు మండుతుంది కదా! 

అందుకని 'మండే' అంటారు.


*ప్రశ్నికుడు*

4 . ఒక పిల్లవాడు ఇంటినుండి పారిపోతే కనిపించుటలేదు అని ప్రకటిస్తారు కదా! దానికి పిల్లాడి స్పందన ఏమిటి?


*అవధాని*

      *కని-పెంచుట* లేదు .


*ప్రశ్నికుడు*

5 . ఈ రోజుల్లో పిల్లలు 

     తల్లిని Head Cook గా

     చూస్తున్నారు . 

     మరి తండ్రిని

     ఎలాచూస్తున్నారు?


*అవధాని*

   *ATM* లాగా చూస్తున్నారు.


*ప్రశ్నికుడు*

6 . సభలో ఎవరైనా 

      ఆవులిస్తే మీరేమి చేస్తారు?


*అవధాని*

       పాలిచ్చేవైతే , అవధానం

        అయ్యాక యింటికి    

        తోలుకెళ్తా .


*ప్రశ్నికుడు*

7 . మనిషికి 

      ఆనందాన్నిచ్చే సిటీ ఏది?


*అవధాని* 

       పబ్లిసిటీ


*ప్రశ్నికుడు*

8 . తుద+ తుద = తుట్టతుద,

      కడ  + కడ = కట్టకడ

      అవుతుంది కదా! 

      అరటి + అరటి 

      ఏమవుతువుంది?


*అవధాని*.

      అర టీ + అర టీ 

     *ఫుల్ టీ* అవుతుంది.


*ప్రశ్నికుడు*

9 . క్రికెట్ ప్లేయరుకీ, 

     అవధానికీ 

     సామ్యం ఉందా?


*అవధాని*.

      వాళ్ళు  *world play* కి    

       వెళ్తారు , 

       మేము  *words play* కి    

        వెళ్తాము.


*ప్రశ్నికుడు*

10 . 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అన్నాడు వేమన, ఇప్పుడు మీరేమంటారు? 


*అవధాని*.

     "పురుషులందు

       పుణ్యపురుషులు 

      *ఏరయా?* అంటాను.


*ప్రశ్నికుడు-*

11 . దేవుని గుడికి 

        తాళం వెయ్యాలా?


*అవధాని*

        భజన జరిగే చోట 

        *తాళం* తప్పనిసరి.


*ప్రశ్నికుడు*

12 . అద్దం ముందున్న

        ఆడువారికీ,

        మైకు ముందున్న

        అమాత్యులకీ 

        తేడా ఏమిటి?


*అవధాని*

      ఇద్దరికీ *సమయం*     

      తెలియదు!


 చదివి ఆనందించండి.

పద ప్రయోగ వినోదాన్ని పదిమందికీ పంచండి.


స్వచ్ఛమైన...నవ్వు నవ్వండి.

 మన భాషను అందులోని గాంభీర్యాన్ని సోయగాన్ని, శ్లేషను, చతురతను తెలుసుకోండి.


తెలుగు భాషకు మాత్రమే ఇది స్వంతము 🌹🚩

ప్రాంజలి ప్రభ కథలు

వృద్ధాప్యంలో ఏమిటీ గందరగోళం?

"నాల్గవ సంవత్సరం మెడిసిన్ విద్యార్థులకు నేను క్లినికల్ మెడిసిన్ నేర్పించినప్పుడల్లా, నేను ఈ క్రింది ప్రశ్న అడుగుతాను:

"వృద్ధులలో మానసిక గందరగోళానికి కారణాలు ఏమిటి?"

కొందరి సమాధానం: "తలలో కణితులు".

నేను: కాదు!

ఇతరులు: "అల్జీమర్స్ యొక్క ప్రారంభ లక్షణాలు".

నేను: కాదు!
 
సమాధానాల తిరస్కరణతో, వారి నుంచి స్పందన ఆగిపోయింది

అప్పుడు నేను చెప్పిన సమాధానం విని వాళ్లంతా నోరు తెరిచేసారు:

- నిర్జలీకరణం


 
ఇది ఒక జోక్ లాగా ఉండవచ్చు; కానీ అది నిజం

60 ఏళ్లు పైబడిన వ్యక్తులలో సాధారణంగా దాహం అనుభూతి ఆగిపోతుంది. తత్ఫలితంగా, ద్రవాలు తాగడం మానేస్తారు.
ఫ్లూయిడ్స్ తాగమని గుర్తు చేయడానికి ఎవరూ లేనప్పుడు, వారు త్వరగా డీహైడ్రేట్ అవుతారు.

నిర్జలీకరణం తీవ్రమైనది మరియు మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఆకస్మిక మానసిక గందరగోళం, రక్తపోటు తగ్గడం, గుండె దడ పెరగడం, ఆంజినా (ఛాతీ నొప్పి), కోమా మరియు మరణానికి కూడా కారణం కావచ్చు.
 
ద్రవాలు తాగడం మరచిపోయే ఈ అలవాటు 60 ఏళ్ల వయస్సులో ప్రారంభమవుతుంది, మన శరీరంలో కేవలం 50% కంటే ఎక్కువ నీరు ఉంటే, 60 ఏళ్లు పైబడిన వారికి తక్కువ నీటి నిల్వ ఉంటుంది. ఇది సహజ వృద్ధాప్య ప్రక్రియలో భాగం.
 
ఇక్కడ మరొక ఇబ్బంది ఉంది. అదేమిటంటే వారు నిర్జలీకరణానికి గురైనప్పటికీ, వారు నీరు త్రాగాలని భావించరు, ఎందుకంటే వారి అంతర్గత సమతుల్య విధానాలు సరిగా పనిచేయకపోవడం వలన.

ముగింపు:
 
60 ఏళ్లు పైబడిన వ్యక్తులు సులభంగా డీహైడ్రేట్ అవుతారు, వారికి తక్కువ నీటి సరఫరా ఉన్నందున మాత్రమే కాదు; వారు శరీరంలో నీటి కొరతను అనుభూతి చెందరు కాబట్టి.

60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, ప్రతిచర్యలు మరియు రసాయన విధుల పనితీరు వారి మొత్తం శరీరాన్ని దెబ్బతీస్తుంది.
 
అందువల్ల  రెండు విషయాలు బాగా గుర్తు పెట్టుకోండి

1) నీరు & ద్రవాలు తాగడం అలవాటు చేసుకోండి. ద్రవాలలో నీరు, రసాలు, గ్రీన్ టీలు, కొబ్బరి నీరు, సూప్‌లు మరియు పుచ్చకాయ, పుచ్చకాయ, పీచెస్ మరియు పైనాపిల్ వంటి నీరు అధికంగా ఉండే పండ్లు ఉన్నాయి; ఆరెంజ్ మరియు టాన్జేరిన్ కూడా పని చేస్తాయి.
 
ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి రెండు గంటలకు, తప్పనిసరిగా కొంత ద్రవాన్ని త్రాగాలి.

ఇది బాగా గుర్తుంచుకోండి:

2) కుటుంబ సభ్యులకు హెచ్చరిక: 60 ఏళ్లు పైబడిన వారికి నిరంతరం ద్రవాలను అందించండి. అదే సమయంలో, వారిని గమనించండి.
 
వారు ద్రవాలను తిరస్కరిస్తున్నారని మరియు ఒక రోజు నుండి మరొక రోజు వరకు వారు చికాకుగా, ఊపిరి పీల్చుకోకుండా లేదా శ్రద్ధ లేకపోవడాన్ని ప్రదర్శిస్తున్నారని మీరు గ్రహించినట్లయితే, ఇవి దాదాపుగా నిర్జలీకరణం యొక్క పునరావృత లక్షణాలు అని గ్రహించండి
****


🤝మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు🙏

🤝చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ...
🤝‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,
నన్ను ఎవరూ గమనించడం లేదు’
అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .
🤝మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి
నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి .
🤝వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .
🤝ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,
🤝వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .
🤝దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .
🤝ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .
🤝అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .
🤝ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .
🤝అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .
🤝ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
🤝అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు .
🤝అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .
🤝 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .
🤝 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం .
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
🤝నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .
🤝అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .
🤝ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .
🤝ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు 👋.
🚩🙏🙏🙏🚩
*🙏🏻🌹శుభోదయం*🌹🙏🏻

_*💫అన్నం..*_
              _*పరబ్రహ్మ...*_
                   _*స్వరూపం !! 🎊*_
➖➖➖➖➖➖➖✍️

*_మంత్రి పదవి లభిస్తే కొండ మీది హనుమను దర్శించు కుంటానని మొక్కు కున్నాడు రాయుడు. రాయుడికి మంత్రి పదవి లభించింది. కొండమీది హనుమంతుడిని దర్శించుకొని కొండకింద వున్న తిక్కశంకరయ్య హోటల్ లో భోజనం చేద్దామని సిబ్బందితో సహా వెళ్ళాడు._*

*_అక్కడి హోటల్ని చూసి విస్తుపోయాడు. రెండు అంతస్తులతో వైభవోపేతంగా వుంది, చాలా కార్లు నిలిచి వున్నాయి. అక్కడ జనం కూడా చాలా మందే వున్నారు._*

*_30 ఏళ్ళ క్రితం అక్కడ చిన్న పెంకుటింట్లో వుండేది ఆ హోటల్. ఆ హోటల్ని శంకరయ్య అనే ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు నడిపేవాడు. అరటి ఆకుల్లో భోజనం పెట్టేవాడు. రెండుకూరలు, రెండు పచ్చళ్ళు, పప్పు పులుసు అన్నీ ఉండేవి మంచి ఘుమ ఘుమ లాడే నెయ్యి కూడా వేసేవాడు. గడ్డ పెరుగు కూడా వేసేవాడు. ‘హాయిగా తినండి. నిదానంగా తినండి తొందరేమీ లేదు’ అని అంటూ అన్ని బల్లల దగ్గరికీ బెత్తం పట్టుకొని తిరిగేవాడు._*

*_'ఎంత కావాలో అంతే పెట్టించుకోండి ఆహారాన్ని వృధా చెయ్యకండి !’ అని హెచ్చరిస్తూ తిరిగేవాడు. ఎవరైనా పారేస్తే చెయ్యి చాపమని బెత్తంతో కొట్టేవాడు. ఎంత పెద్దవాళ్ళయినా, చిన్నవాళ్ళయినా పారేస్తే దెబ్బలు తినాల్సిందే._*

*_బళ్ళో పిల్లలు తప్పు చేస్తే ఎలా కొట్టే వాడో ఇక్కడా అంతే. అక్కడ వేరే మంచి హోటల్ లేకపోవడంతో అక్కడ పదార్థాలు చాలా రుచిగా వుండడంతో  అందరూ అక్కడికే వచ్చేవాళ్ళు. అందరూ అతన్ని తిక్కశంకరయ్య అని పిలిచేవారు._*

*_రాయుడు అప్పట్లో రాజకీయాల్లోకి రాలేదు. పెద్ద వ్యాపారవేత్తగా డబ్బు బాగానే గడించాడు. అప్పట్లో తనకు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తే కొండ మీది హనుమను దర్శించుకుంటానని మొక్కుకొని లాభాలు బాగా రాగానే కొండమీది స్వామిని దర్శించుకొని ఆ హోటల్ లో భోజనం చేద్దామని వచ్చాడు._*

*_శంకరయ్య ఎంత చెప్తున్నా వినకుండా అది వెయ్యండి యిది వెయ్యండి. అని అన్నీ వేయించుకొని తిన్నంత తిని సగం పారవేసి చెయ్యి కడుక్కున్నాడు. అది చూసి శంకరయ్యకు కోపం నసాళానికి అంటింది._*
*_బెత్తం పట్టుకొని రాయుడి దగ్గరకు వచ్చి చేయి చాచమన్నాడు._*

*_చుట్టూ వున్నవాళ్ళు ‘అతను ఎవరనుకున్నావు ? పెద్ద జమీందారు ! అయినా డబ్బు చెల్లిస్తున్నాం మా యిష్ట మొచ్చినంత  తింటాం పారేస్తాం నీకేమిటి ?’ అన్నారు అతని వెంట వచ్చినవాళ్ళు._*

*_”మీరు డబ్బు చెల్లించినా సరే పారెయ్యడానికి మీకు హక్కు లేదు. ఎన్ని కోట్లు డబ్బు వున్నా ఆకలేస్తే డబ్బు తింటారా ? మీకందరికీ కూడా సామాజిక బాధ్యత వుండాలి, బరువూ బాధ్యత తెలుసుకొని నడుచుకోవాలి, అన్నాన్ని పారేస్తే మీకు ఎప్పుడయినా ఆకలి వేసినప్పుడు అన్నం దొరకదు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం !’  దాన్ని వృధా చెయ్యకూడదు. ఇలా వ్యర్థం చేస్తే మీ తరువాతి తరాలవారికి తినడానికి తిండి దొరకదు అన్నాడు._*

*_రాయుడు నవ్వుతూ చెయ్యి జాచాడు. శంకరయ్య బెత్తంతో గట్టిగా కొట్టాడు._*

*_అప్పటి సంగతి రాయుడికి జ్ఞాపకం వచ్చింది. తర్వాత ఎమ్.ఎల్.ఏ గా నిలబడి గెలిచాడు. ఇప్పుడు మంత్రి పదవి లభించింది. ఇన్ని  సంవత్సరాలకు మళ్ళీ ఆ హోటల్ లో ప్రవేశించాడు తన అనుచరులతో పాటు._*

*_శంకరయ్యగారు చనిపోయినట్టున్నాడు, అతని ఫోటో అక్కడ బల్ల మీద పెట్టివుంది పూలమాల వేసి. ఆ ఫోటో వెనక అతని బెత్తం కూడా వుంది బూజు పట్టి.    మంత్రిగారు వచ్చారని అక్కడి యజమాని శంకరయ్య కొడుకు విఘ్నేశ్వరయ్య పరిగెత్తుకుంటూ వచ్చి తెగ హడావుడి చేసి తన మనుషులతో చెప్పి రకరకాల పదార్థాలను వద్దంటున్నా వినకుండా వేయించాడు. అందరూ తినలేక చాలా పారవేశారు._*

*_అది చూసి రాయుడికి చాలా బాధ కలిగింది. తట్టుకోలేక పోయాడు. శంకరయ్య ఫోటో వెనక వున్న బెత్తం చేతిలోకి తీసుకున్నాడు. కోపంగా విఘ్నేశ్వరయ్య దగ్గరికి వెళ్లి “యింత అతి మర్యాద చేసే అవసరం లేదు. ముందు నీ బాధ్యత తెలుసుకో ! ఎంత భోజనం వృధా అయింది చూడు !” అని అతన్ని చెయ్యి చాచమని చితక బాదాడు._*

*_ఆ బూజు పట్టిన బెత్తాన్నిముద్దు పెట్టుకొని ఆ బెత్తాన్ని ఫోటో వెనకాల పెట్టి బయటకు నడిచాడు._*

*_ఈ కాలంలో అటువంటి నేతలు వున్నారా ? వుంటే వారికి పాద నమస్కారం చెయ్యాల్సిందే._*

*_మనమంతా కూడా ఎక్కడయినా సరే తినే పదార్థాలను వృధా చెయ్యకూడదు. ఇప్పటికీ మా యింట్లో మా పిల్లలతో సహా దీన్ని పాటిస్తాము. మరి మీరు..?_*

*_(నవ్య వార పత్రిక సౌజన్యంతో)_*

*_’అన్నం పరబ్రహ్మ స్వరూపం !’ దాన్ని పారవేస్తే మరుజన్మలో మనకు "అన్నమో రామచంద్రా" అని ఏడ్చే గతి పడుతుందని పెద్దలు చెప్తారు !_*

*_రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*

🙏🇮🇳😷💉🎊🪴🦚🐍
దేవుడి వైపు కు నడుద్దాం అనే చిన్న కధ

   ఒక ఊర్లో వున్న గుడి లో జరగబోయే ప్రవచనానికి , పురాణ శ్రవణానికి  రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు , ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తే అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట : '' వచ్చి ఏమి సాధించేది వుంది ? గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం , పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను. ఒక్కటైనా  గుర్తుందా ? అందుకే దేవస్థానానికి  రావడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు. '' అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట : '' నాకు పెళ్ళి అయ్యి ముప్పై ఏళ్ళు అయ్యింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం ముప్పై రెండు వేల సార్లు భోజనం వండి వడ్డించివుంటుంది. నేను తిన్న ఆ భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా ? కాని నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే  ఆమె వండిన భోజనం నుండి నేను శక్తి ని పొందగలిగాను. ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండిపెట్టక పోయివుంటే  నాకు ఆ శక్తి ఎక్కడిది ? ఈ పాటికి చనిపోయివుండేవాడిని. '' 

   అందుకే , శరీరానికి భోజనం [ ఆహారం ] ఎలాగో . మనసుకు  దైవ ధ్యానం , దైవ నామ స్మరణ అలాగా.  నిరంతరం చేస్తూనే వుండాలి. మనిషి జన్మ కు ఒకే ఒక లక్ష్యం  దైవ సాక్షాత్కారం   అంటుంది భగవద్గీత. అందుకే దైవం వైపు నడుద్దాం.🙏
****


కాళిదాసుకు అక్షర లక్షలు


భోజరాజు రాజ్యంలోని ఓ నలుగురు బ్రాహ్మణులు చాలా బీదవారు.మంచి కవిత్వం చెబితే రాజు ధనాన్ని ఇస్తాడన్న ఆశతో ఓ మంటపంలో కూర్చుని శ్లోకం రాయటం ప్రారంభిస్తారు. ఒక వ్యక్తి ‘భోజనం దేహి రాజేంద్ర’ అని,. రెండో వ్యక్తి ‘ఘృతసూప సమన్వితమ్‌’ అని రెండు పాదాలు రాశారు.  ఓ రాజా! పప్పు, నెయ్యిలతో కూడిన భోజనాన్ని మాకు అనుగ్రహించు అని ఈ రెండు పాదాలకు అర్థం. మిగిలిన రెండు పాదాలను పూర్తిచెయ్యలేక వారు నానా తంటాలు పడుతుంటారు. 

ఇంతలో అటుగా వచ్చిన కాళిదాసు ‘మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధీ’ అని మూడు, నాలుగు పాదాలు పూర్తిచేస్తాడు. శరత్కాలంలో వెలిగే చంద్రుడి వంటి పరిమాణంలో ఉన్న గారెలు, ఆ శరత్కాలపు చంద్రుడు కురిపించే వెన్నెల వర్ణంతో సమానమైన స్వచ్ఛమైన పెరుగుతో కలిసిన భోజనం కావాలి ఆ బ్రాహ్మణులు రాజాస్థానానికి వెళ్లి శ్లోకం వినిపిస్తారు. భోజరాజు ఆ బ్రాహ్మణుల జీవితానికి సరిపడినంత ధనం ఇవ్వమని మంత్రిని ఆదేశించి, మూడు నాలుగు పాదాలు రాసిన కవికి అక్షరలక్షల ముత్యాలు ఇవ్వమంటాడు. శరత్కాల చంద్రుడిని ఇంత అందంగా వర్ణించగల కవి కాళిదాసు తప్ప మరొకరు లేరంటాడు భోజరాజు.

16 కళల వెనక కథ ఇదీ...

చంద్రుడికి ఈ కళలు రావటం వెనుక పురాణగాథ ఉంది. దక్షప్రజాపతి అశ్వని, భరణి మొదలైన తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. అందరినీ అనురాగంగా చూసుకుంటున్నప్పటికీ రోహిణి అంటే చంద్రుడికి ఎక్కువ ఇష్టం ఉండేది. ఆమెపై ఎక్కువ అనురాగం, ఆప్యాయత కనబరచేవాడు. ఇది సహించలేని మిగిలిన అక్కాచెల్లెళ్లు తండ్రితో విషయాన్ని చెబుతారు. అతడు చంద్రుడిని పిలిచి కుమార్తెలందరినీ సమానంగా చూసుకోవాలని హితవు చెబుతాడు. అయినా, చంద్రుడు తన పద్ధతి మార్చుకోకపోవటంతో ఆగ్రహించిన  దక్షుడు అల్లుడనే ఆలోచన లేకుండా చంద్రుడికి క్షయవ్యాధి కలగాలని శపిస్తాడు. శాపం కారణంగా చంద్రుడు నానాటికీ క్షీణించసాగాడు. దీంతో అతని నుంచే వచ్చే వెన్నెల ఆగిపోయింది. లతలు, వృక్షాలు వాడిపోయాయి. కలువలు వికసించలేదు. ఓషధుల్లో గుణం నశించింది. 

 లోకానికి కలిగిన ఈ అకారణ దుఃఖాన్ని గమనించిన ఇంద్రాది దేవతలు చంద్రుడితో సహా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, చంద్రుడికి శాపవిముక్తి కలిగించమని ప్రార్థిస్తారు. ప్రభాస క్షేత్రంలో శివుడిని గురించి తపస్సు చెయ్యమని బ్రహ్మదేవుడు చెబుతాడు. ఆవిధంగా తపస్సు చేసిన చంద్రుడికి  శివుడు ప్రత్యక్షమై రోజుకు ఒక కళ నశించేలా, తిరిగి 15 రోజుల తర్వాత రోజుకు ఒక కళ పెరుగుతూ పూర్ణచంద్రుడిగా పూర్ణిమ రోజున ప్రకాశించేలా అనుగ్రహిస్తాడు. ఇలా చంద్రుడి కళల్లో తగ్గుదల, పెరుగుదల కారణంగా ఏర్పడినవే శుక్ల, కృష్ణ పక్షాలు. ఈ విధంగా చంద్రుడికి పదహారు కళలు ఏర్పడ్డాయి. శరత్కాలంలో వచ్చే తొలి పూర్ణిమ ఆశ్వయుజ పూర్ణిమ. ఈ రోజుకు అనేక పేర్లు,  ఈ రోజున ‘కౌముద్యుత్సవం’, ‘కోజాగరీ’ వ్రతాలు చేస్తారు. వాలఖిల్య మహర్షి ద్వారా కోజాగరీ వ్రతం వ్యాప్తిలోకి వచ్చింది. ఆశ్వయుజ పూర్ణిమను ‘కౌమార పౌర్ణమాసి’ పేరుతో కొన్ని చోట్ల పాటిస్తారు. మరికొందరు ఈ రోజున లక్ష్మీంద్ర కుబేర పూజ చేస్తారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఆశ్వయుజ పూర్ణిమ రోజున ‘గొంతెమ్మ పండుగ’ జరుపుకుంటారు. గొంతెమ్మ అంటే ‘కుంతి’ అని అర్థం. పార్వతీదేవికి ఉన్న పేర్లలో ‘కుంతిపరమేశ్వరి’ ఒకటి. అందువల్ల గొంతెమ్మ పండుగ పార్వతీదేవికి సంబంధించిందిగా తెలుస్తోంది. . శరత్పూర్ణిమ రోజున ఆరుబయట వెన్నెలో పరమాన్నం వండి, దాని మీద చంద్రకిరణాలు పడేలా ఉంచి, ఆ ప్రసాదాన్ని స్వీకరించే ఆచారం కొన్నిప్రాంతాల్లో ఉంది.

ఎన్నో నోములు …మరెన్నో పూజలు

శరత్పూర్ణిమ వ్రతాన్ని కొన్ని ప్రాంతాల్లో ఆచరిస్తారు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో ఒక సంపన్నకుటుంబానికి చెందిన దంపతులకు కలిగిన బిడ్డ ఏమాత్రం అంగసౌష్టవం లేకుండా ఉండేది. ఓ సిద్ధ పురుషుడి సూచనతో ఆ దంపతులు అప్పటికే కన్యగా ఎదిగిన తమ బిడ్డతో ‘శరత్పూర్ణిమ’ నోము నోయించారు.. శరత్కాలం ప్రారంభమైన తొలిరోజున ఆరుబయట చంద్రకాంతిలో ఉండేలా వెండితో చేసిన అమ్మవారి ప్రతిమను అర్చించి, వెండితో చేసిన చంద్రుడి ప్రతిమను దానం చేయిస్తారు. ఇలా చంద్రుడిలో ఉండే పదహారు కళలకు ప్రతీకగా శుక్లపక్షమంతా చేయిస్తారు. తిరిగి కార్తికమాసం శుక్ల పక్షంలో కూడా ఈ విధానంలో అర్చనలు చేయిస్తారు. ఇలా మూడేళ్లు చేయగానే ఆ కన్య  సుందరిగా ప్రకాశించింది.

ఖగోళ విజ్ఞానపరంగా చూస్తే ఆశ్వయుజ మాస ప్రారంభంలో ఆకాశంలో అగస్త్య నక్షత్రం కనిపిస్తుంది. ఇది శరత్కాలానికి ప్రారంభ సూచిక. ఈ నక్షత్రం కనిపించగానే రాజులు దండయాత్రలకు బయల్దేరటానికి సిద్ధపడేవారని కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో రాశాడు.మనస్సును ఆహ్లాద పరిచే సౌందర్యం శరచ్చంద్రుడిలో ఉంది. ముఖచంద్రుడు అనడంలో అంతరార్థం ఇదే. తాను ప్రశాంతంగా ఉంటూ తన తోటి వారిని కూడా ప్రశాంతంగా ఉంచే వారే నిజమైన ఆధ్యాత్మిక సాధకులు అవుతారు.  మనవల్ల సమాజం ఉద్వేగం పొందని స్థితిలో ఉన్నా, సమాజం వల్ల మనం ఉద్వేగానికి లోనుకాని స్థితిలో ఉన్నా.. మానవ జీవనం ఆత్మజీవనం అవుతుంది.కార్తీక పూర్ణిమ రోజున ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం స్త్రీలకు సౌభాగ్యం కలిగించే వ్రతంగా చేసుకునే ఆచారం ఉంది.

చంద్రుడు పదహారు కళలతో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఆ కళలు1.అమృత 2.మానద 3.పూష 4.తుష్టి 5.సృష్టి 6.రతి 7.ధృతి 8.శశిని 9.చంద్రిక 10.కాంతి 11.జ్యోత్స్న 12.శ్రీ

13.ప్రీతి 14.అంగద 15.పూర్ణ 16.పూర్ణామృత

*****

ముగ్గురు రాకుమారులు -- చందమామ కథలు

రత్నగిరి రాజు రాజభూషణుడు ధర్మప్రభువుగా పేరుగాంచాడు. ఆయన పాలనలో ప్రజలు ఏ కొరతా లేకుండా సుఖశాంతులతో జీవించేవారు. ఆయనకు ముగ్గురు కుమారులు. ముగ్గురూ యుక్త వయస్కులయ్యారు. వారిలో ఒకరిని త్వరలో రాజ్యాభిషిక్తుణ్ణి చేయవలసి వుంది. అందువల్ల రాజు వారిని ఒకనాడు చేర బిలిచి, ‘‘మీరు ముగ్గురూ దేశాటన చేసి ప్రజల స్థితిగతులను, ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలి. రేపు తెల్లవారగానే ముగ్గురూ మూడు దిశలకేసి వెళ్ళి, సాయంకాలానికల్లా తిరిగివచ్చి మీరు చూసినదానిని గురించి నాకు చెప్పండి,'' అన్నాడు. మరునాడు తెల్లవారగానే, ముగ్గురు రాకుమారులూ బయలుదేరారు. పెద్ద కుమారుడు రాజకీర్తి తూరుపు దిక్కుకేసీ, రెండవ రాకుమారుడు రాజమూర్తి ఉత్తరం దిక్కుకేసీ, మూడవ రాకుమారుడు రాజస్నేహి దక్షిణం దిక్కుకేసీ పయనమయ్యారు. సూర్యాస్తమయం అయ్యేసరికి వెనుదిరిగి భవనం చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.

రాజకీర్తి చాలా దూరం నడిచి ఒక అడవిని చేరుకున్నాడు. ఒక కొలను గట్టున పచ్చిక మేస్తున్న మూడు చక్కని గుర్రాలు ఆయన దృష్టిని ఆకర్షించాయి. దాపులనే వున్న పొడవైన చెట్టు కింద ఆశీసునుడైన ఒక యోగి ఆ గుర్రాల కేసి తదేకంగా చూస్తున్నాడు. రాకుమారుడు యోగిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. యోగి మందహాసం చేస్తూ, ‘‘నువ్వు ఎవరివి నాయనా? ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు?'' అని అడిగాడు. రాజకీర్తి తాను ఎవరైనదీ చెప్పి, తాను వెళుతూన్న కార్యం గురించి వివరించి, ‘‘మహాత్మా! తమరు అనుమతించినట్టయితే, మీ గుర్రాలలో ఒకదాని మీద వెళ్ళి, మరిన్ని ప్రదేశాలనూ, మరింత ఎక్కువమందినీ చూసి వస్తాను,'' అన్నాడు. ‘‘అలాగే, నీకు కావలసిన గుర్రాన్ని తీసుకు వెళ్ళు. అయితే, సూర్యాస్తమయం అయ్యేలోగా గుర్రాన్ని తెచ్చి నాకు అప్పగించాలి. నువ్వు చూసిన విశేషాలను గురించి తెలియజేయాలి,'' అన్నాడు యోగి. రాజకీర్తి ఒక గుర్రాన్ని అధిరోహించి అక్కడి నుంచి బయలుదేరాడు.

చాలా దూరం ప్రయాణం చేశాక ఆయనకు ఒక తోట కనిపించింది. తోటమాలి కోసం చుట్టుపక్కల కలయచూశాడు. తోటమాలి కనిపించలేదు గాని, తోట చుట్టూ బలమైన కంచె వేసి ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం మరొకటి జరిగింది. ఆయన చూస్తూండగానే కంచె కోసం కట్టిన దృఢమైన పుల్లలు ఉన్నట్టుండి కొడవళ్ళుగా మారి తోటలోని పళ్ళనూ, కాయగూరలనూ తెగనరకడం ప్రారంభించాయి. యువరాజు రాజకీర్తి తన కళ్ళను తనే నమ్మలేక అమితాశ్చర్యంతో వెనుదిరిగాడు. అరణ్యానికి చేరుకుని యోగికి గుర్రాన్ని అప్పగించబోయాడు. అప్పుడు యోగి, ‘‘దాచుకోలేని ఆశ్చర్యంతో సతమతమవుతున్నట్టున్నావు. ఏమిటి విశేషం?'' అని అడిగాడు. రాజకీర్తి తను చూసిన విచిత్రమైన తోట గురించి వివరించాడు. అంతా విన్న యోగి, ‘‘ఆ దృశ్యం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి?'' అని అడిగాడు. ‘‘అంతా విచిత్రంగా వుంది. ఎందుకలా జరిగిందో చెప్పలేకపోతున్నాను మహాత్మా,'' అన్నాడు రాజకీర్తి. ‘‘ఇలాంటి సామాన్యమైన విషయాలను కూడా అర్థం చేసుకోలేనివాడివి, రేపు రాజ్య పాలన ఎలా చేయగలవు? రాజ్యం, మూర్ఖుడైన రాజును భరించలేదు. నిన్నిప్పుడే రాతిస్తంభంగా మార్చేస్తున్నాను,'' అని యోగి రాజకీర్తిని శపించాడు. రాత్రి చాలా పొద్దుపోయినా రాజకీర్తి తిరిగి రాకపోవడంతో రాజభవనం చేరుకున్న ఆయన తమ్ములూ, తండ్రీ ఆందోళన చెందారు.

మరునాడు తెల్లవారగానే, రెండవ కుమారుడు రాజమూర్తి, అన్నను వెతుక్కుంటూ వెళ్ళాలని నిర్ణయించారు. తెల్లవారగానే రాజమూర్తి, తన అన్న వెళ్ళిన మార్గంలో వెళ్ళి అడవిని చేరుకున్నాడు. కొలను గట్టున మేస్తూన్న గుర్రాలను చూశాడు. యోగికి నమస్కరించి, ‘‘ఇలాంటి చక్కటి గుర్రాలను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఒక గుర్రాన్ని ఇస్తారా?'' అని అడిగాడు. ‘‘నిరభ్యంతరంగా తీసుకువెళ్ళు. అయితే సూర్యాస్తమయంలోపల తిరిగి వచ్చి గుర్రాన్ని అప్పగించి, నీ అనుభవాలను చెప్పాలి,'' అన్నాడు యోగి మందహాసం చేస్తూ. గుర్రాన్ని అధిరోహించే ఉత్సాహంలో రాజమూర్తి పక్కనే శిలగా మారివున్న తన అన్న ముఖం కేసి కూడా చూడలేదు. ఇరువైపులా అన్న కేసి పరిశీలనగా చూస్తూ ఆయన చాలా దూరం ముందుకు వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళినా అన్న జాడ కనిపించలేదు. కాని, వీపు మీద కట్టెల మోపు మోస్తూ వంగిపోయిన ఒక పండు ముసలివాడు కనిపించాడు. రాజమూర్తికి అతనిపై జాలి కలిగింది. అతడు గుర్రాన్ని ఆపి, ‘‘తాతయ్యా, కట్టెలమోపు నేను మోసుకురానా?'' అని అడిగాడు. ముసలివాడు తలపైకెత్తి చూడలేదు. కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఇంకా ఎండు పుల్లలు ఏరడంలో నిమగ్నుడై కనిపించాడు. రాజమూర్తికి చాలా వింతగా తోచింది. సూర్యుడు పడమటి దిశకు చేరడంతో ఆయన వెనుదిరిగి వచ్చి, గుర్రాన్ని యోగికి అప్పగించి నమస్కరించాడు. ‘‘దారిలో నీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ఏమిటి?'' అని అడిగాడు యోగి చిన్నగా నవ్వుతూ. రాజకీర్తి తాను చూసిన ముసలివాణ్ణి గురించి చెప్పాడు. ‘‘నువ్వు అందిస్తానన్న సాయాన్ని ఆ ముసలివాడు ఎందుకు వద్దన్నాడో తెలుసా?'' అని అడిగాడు యోగి. ‘‘తెలియదు మహాత్మా. అతడొక మాట కూడా మాట్లాడలేదు,'' అన్నాడు రాజమూర్తి. ‘‘ఇలాంటి స్వల్ప విషయాలు కూడా తెలియని నువ్వు, మునుముందు రాజువైతే కష్టతరమైన ప్రజాపాలనను ఎలా సమర్థవంతంగా నిర్వహించగలవు? నువ్వు మూర్ఖుడివి. రాకుమారుడిగా వుండతగవు. నిన్నిప్పుడే శిలగా మార్చేస్తున్నాను,'' అన్నాడు యోగి.

రాజమూర్తి కూడా రాకపోయేసరికి రాజు విచారానికి గురయ్యాడు. మూడవ కుమారుడు రాజస్నేహి తండ్రిని ఓదార్చి అన్నలను వెతుక్కుంటూ వెళతానన్నాడు. తెల్లవారగానే అన్నలు వెళ్ళిన మార్గంలో బయలుదేరి రాజస్నేహి అడవిని చేరుకుని, కొలను దగ్గర మేస్తున్న గుర్రాలనూ, యోగినీ చూశాడు.

పక్కనే వున్న రెండు రాతిస్తంభాలనూ, వాటిలో స్పష్టంగా కనిపించిన తన అన్నల ముఖపోలికలనూ చూసి ఆశ్చర్యపోయాడు. యోగిని సమీపించి నమస్కరించి తన అన్నల గురించి అడిగాడు. ‘‘అవును. వాళ్ళు ఇక్కడికి వచ్చారు,'' అంటూ మందహాసం చేసిన యోగి, ‘‘నా గుర్రాలను తీసుకుని వెళ్ళి సాయంకాలానికి తిరిగివచ్చారు. వాళ్ళు చూసిన దృశ్యాల అంతరార్థాన్ని గురించి అడిగితే చెప్పలేకపోయారు. నేనే వారిని శిలా స్తంభాలుగా మార్చేశాను,'' అన్నాడు. ‘‘వాళ్ళు పునర్జీవితులయ్యే మార్గం సెలవివ్వండి, మహాత్మా,'' అన్నాడు రాజస్నేహి. ‘‘ఆ గుర్రాలలో ఒకదానిని అధిరోహించి ముందుకు వెళ్ళు. ఏదైనా వింత దృశ్యం కనిపిస్తే వచ్చి నాతోచెప్పు. దానిని గురించి చక్కని వివరణతో నా ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చావంటే మీ ముగ్గురన్నదమ్ములు మూడు గుర్రాల మీద హాయిగా రాజధానిని చేరుకోవచ్చు,'' అన్నాడు యోగి. రాజస్నేహి కొంతసేపు తీవ్రంగా ఆలోచించాడు. తన అన్నలను కాపాడుకోవడానికి తన అదృష్టాన్ని పరీక్షించాలన్న నిర్ణయంతో, యోగికి నమస్కరించి, ఆయన చూపిన దిశగా గుర్రం మీద బయలుదేరాడు. అతడు ఎంతదూరం వెళ్ళినా ఎలాంటి విచిత్ర దృశ్యం గానీ, వింత వ్యక్తి గానీ తారసపడలేదు. చాలా దూరం వెళ్ళడం వల్ల అతడికి దాహం వేసింది. గుర్రానికి కూడా కాస్సేపు విశ్రాంతినిద్దాం అన్న ఉద్దేశంతో ఒక కొలను గట్టున గుర్రం దిగాడు. గుర్రాన్ని పచ్చిక మేయడానికి వదిలి తను దాహం తీర్చుకోవడానికి కొలను దగ్గరికి వెళ్ళాడు. నీళ్ళ దగ్గరికి వెళ్ళి, వంగి దోసిలితో నీళ్ళు అందుకోబోయాడు. నీళ్ళు చేతులకు అందకుండా కుంచించుకుపోవడం గమనించి ఉలిక్కిపడ్డాడు. నీళ్ళలో దిగి మరికొంత ముందుకు వెళదామని రెండడుగులు వేశాడు. నీళ్ళు రెండడుగులు వెనక్కువెళ్ళాయి. అతడు లోపలికి వెళ్ళే కొద్దీ నీళ్ళు ఇంకా లోపలికి వెళ్ళసాగాయి. అతడు కొలను మధ్యకు చేరుకునే సరికి చుట్టూ ఇసుక తప్ప, బొట్టు నీళ్ళు కంటబడలేదు! అమితాశ్చర్యంతో వెనుదిరిగిన రాజస్నేహి యోగి వద్దకు వచ్చాడు. తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పాడు. అంతావిన్న యోగి, ‘‘ఈ విచిత్ర అనుభవం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి?'' అని అడిగాడు. రాజస్నేహి ఎంత ఆలోచించినా సరైన సమాధానం స్ఫురించలేదు. యోగికి ఆమోదయోగ్యమైన సమాధానం చెప్పలేక పోయాడు. ‘‘రాకుమారా, నువ్వు కూడా మీ అన్నలకన్నా తెలివైన వాడివేం కాదు. నీకూ, నీ అన్నల గతి తప్పదు,'' అన్నాడు యోగి. మరుక్షణమే రాజస్నేహి కూడా శిలాస్తంభంగా మారిపోయాడు. అన్నలను వెతుక్కుంటూ వెళ్ళిన రాజస్నేహి కూడా ఎంతకూ రాకపోయేసరికి రాజభవనంలోని రాజు తీవ్రమైన ఆందోళనకు లోనయ్యాడు. తనే చేజేతులా వారిని దేశాటనకని పంపి ఈ దుస్థితికి కారణమైనట్టు భావించి విలవిలలాడి పోయాడు. వాళ్ళకేమయిందో ఎవరికీ తెలియదు. రాకుమారులను వెతకడానికి సైన్యాన్ని వినియోగించాలని మంత్రి సలహా ఇచ్చాడు. అయినా రాజు వినలేదు. తన కుమారులను వెతుక్కుంటూ తనే స్వయంగా వెళ్ళాలనుకున్నాడు. మరునాడు వేకువజామున తన కుమారులు వెళ్ళిన మార్గం గుండా వెళ్ళి, అడవిని చేరి, మేస్తూన్న గుర్రాలకేసి ప్రశాంతంగా చూస్తున్న యోగి సమక్షానికి చేరుకున్నాడు. ఆయనకున్న యోగ శక్తుల ద్వారా, యోగి తన కుమారుల ఆచూకీని తెలియజేయగలడని రాజు ఆశించాడు. రాజు యోగిని సమీపించి నమస్కరించి, ‘‘మహాత్మా, నా ముగ్గురు కుమారులు దేశ సంచారం చేస్తూ ఇటుకేసి తప్పక వచ్చి ఉంటారనుకుంటాను... అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో యోగి అడ్డుపడి, ‘‘అవును మహారాజా, వచ్చారు. వారిని నేను మూడు ప్రశ్నలు అడిగాను. చాలా సులభ మైనవి. కాని సమాధానం చెప్పలేక పోయారు అలాంటి మూఢులకు మునుముందు రాజ్య పాలన చేసే అర్హత లేదు. అందుకే వారిని శిలా స్తంభాలుగా మార్చివేశాను. అదిగో చూడు!'' అన్నాడు. రాజు మూడు రాతిస్తంభాలనూ, వాటి పైభాగంలో తన కుమారుల ముఖజాడలూ చూసి దిగ్భ్రాంతి చెందాడు. కొంతసేపు మౌనం వహించి, ఆ తరవాత, ‘‘ఆ ప్రశ్నలేవో చెప్పండి. నా బిడ్డల తరఫున నేను సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను,'' అన్నాడు. ‘‘నీ జ్యేష్ఠ కుమారుడు రాజకీర్తి తోటమాలి లేని ఒక తోటను చూశాడు. కంచెగా వున్న పుల్లలు ఉన్నట్టుండి కొడవళ్ళుగామారి, తోటలోని పళ్ళను, కాయలను తెగనరకడం ప్రారంభించాయి దీని అంతరార్థం ఏమిటి?'' అని అడిగాడు యోగి. ‘‘తోటలోని చెట్టు చేమలను కాపాడడానికే కంచె ఏర్పాటు చేయబడింది. తన యజమాని ఆస్తిని నాశపరిచే సేవకుడిలాంటిది ఆ కంచె,'' అన్నాడు రాజు. యోగి మందహాసం చేసి, రెండవ రాకుమారుడు చూసిన దృశ్యం గురించి చెప్పి, ‘‘రాజా! ఆ ముసలివాడు మోస్తూన్న బరువైన కట్టెల మోపు చాలదని ఇంకా ఎండు కట్టెలు ఏరుతూనే ఉన్నాడు. దీని భావం ఏమిటో చెప్పగలవా?'' అని అడిగాడు. ‘‘ఆ ముసలివాడు తన దగ్గర ఉన్న దానితో తృప్తి చెందలేదు. పర్యవసానాలను గురించి పట్టించుకోకుండా ఇంకా ఇంకా కావాలని ప్రాకులాడే పేరాశాపరుల దురవస్థకు చిహ్నం ఆ దృశ్యం!'' అన్నాడు రాజు. ‘‘బాగా చెప్పావు,'' అని మరొక్కసారి మందహాసం చేసిన యోగి, ‘‘నీ చిన్న కుమారుడు దాహం తీర్చుకోవడానికి వెళితే కొలనులోని నీళ్ళు దూర దూరంగా వెళ్ళిపోయాయి. మరి దీని వివరణ ఏమిటి రాజా?'' అని అడిగాడు.


 ‘‘సంపదలు ఉన్నప్పుడు దుబారాగా ఖర్చు చేసి, పనికిమాలిన వాటికోసం వృధా చేసే వారికి చివరికి ఏదీ మిగలదు!'' అన్నాడు రాజు. మరుక్షణమే రాకుమారులు ముగ్గురూ నవ్వుతూ కనిపించారు. రాతిస్తంభాల జాడలేదు. ‘‘నా కుమారులకు మళ్ళీ ప్రాణదానం చేసిన తమకు నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. తమ ఆశీస్సులతో వారిని రాజధానికి తీసుకువెళతాను. తమరు కరుణతో రాజధానికి విచ్చేసి, నా కుమారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని వివేకవంతులుగా తీర్చిదిద్దాలని ప్రార్థిస్తున్నాను,'' అన్నాడు రాజు యోగికి చేతులెత్తి నమస్కరిస్తూ. రాజు ప్రార్థనకు యోగి అంగీకరించాడు. ‘‘మీరు ముగ్గురూ మూడు గుర్రాల మీద మీ తండ్రితో రాజధానికి బయలుదేరండి, నేను త్వరలో వస్తాను,'' అని రాకుమారులను ఆశీర్వదించాడు. రాజూ, రాకుమారులూ సంతోషంగా రాజధానికి బయలుదేరారు. మరి కొన్నాళ్ళకు రాజధానికి వచ్చిన యోగికి, భక్తి ప్రపత్తులతో మేళ తాళాలతో స్వాగతం పలికారు. యోగి రాకుమారులను వివేకవంతులుగా, ఆదర్శపాలకులుగా తీర్చిదిద్దాడు.

****



వరాలైన శాపాలు -- చందమామ కథలు
ఒక గ్రామంలో నారాయణ అనే పేద వ్యవసాయదారు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడే కాని, అతనికంటూ సొంతంగా కుంటెడు పొలం కూడా లేదు. అందువల్ల ఇతరుల పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి జీవించేవాడు. అతనికి రెండు తీరని కోరికలుండేవి. ఒకటి దేశాటన చెయ్యటం; రెండోది రుచికరమైన రాజభోజనం తినాలని. అయితే అవి అతని వంటి పేదరైతుకు తీరే కోరికలు కావు. కనీసం రాజధానిలో జరిగే వసంతోత్సవాలైనా చూడాలని నారాయణ ఒక సంవత్సరం, తన స్నేహితుడైన మాధవుడితో కలిసి, రాజధానికి బయలుదేరాడు. వాళ్ళు పగలల్లా ప్రయాణం చేసి, చీకటి పడే సమయానికి అరణ్యం మధ్యలో చిక్కుకుపోయారు. ఆ రాత్రి తలదాచుకోవటానికి ఒక గుడి కనిపించింది. నారాయణ ఉత్సాహంతో, ఆ రాత్రి ఆ గుడిలో గడుపుదామన్నాడు. మాధవుడు తల అడ్డంగా ఊపుతూ, ‘‘ఇది చండముఖి అనే దేవత గుడి.
ఆ దేవత మహా ముక్కోపి. ఆమె పగలల్లా ఎక్కడెక్కడో సంచారం చేసి, ఝాముపొద్దుపోయేసరికి గుడికి తిరిగి వస్తుంది. ఆ సమయానికి గుడిలో ఎవడైనా కనిపిస్తే ఆగ్రహంతో వాణ్ణి శపిస్తుంది. అందుచేత రాత్రివేళ ఎవరూ గుడిలోకి అడుగు పెట్టరు,'' అన్నాడు. ‘‘దేవత ఆగ్రహిస్తే ఆగ్రహించనీ, నే నింక ఒక్క అడుగైనా ముందుకు రాలేను,'' అంటూ నారాయణ ఆవులించి, గుడిలోకి వెళ్ళాడు. మాధవుడు మరేం మాట్లాడకుండా ముందుకు సాగి పోయాడు. గుడిలో నడుమువాల్చిన మరుక్షణం నారాయణకు నిద్ర పట్టేసింది. కొంత రాత్రి గడిచినాక ఎవరో కొరడాతో కొట్టినట్టు తోచి, నారాయణ ఉలిక్కిపడి నిద్ర మేలుకున్నాడు. ఎదురుగా ఒక దేవత, ఎరట్రి కళ్ళతో, చేతిలో కొరడా పట్టుకుని నిలబడి ఉంది, ‘‘ఎవడ్రా నువ్వు? నా అనుమతి లేకుండా నా గుడిలో పడుకోవటానికి నీకెంత ధైర్యం!'' అన్నది పట్టరాని కోపంతో. నారాయణ ఆమెకు చేతులెత్తి భక్తితో నమస్కరించి, ‘‘తల్లీ, నే నొక పేద రైతును. వసంతోత్సవాలు చూడడానికి రాజధానికి పోతూ, అలసిపోయి, చీకటి పడేసరికి, ఇక్కడ విశ్రమించాను. నా వల్ల తప్పు జరిగితే క్షమించు,'' అన్నాడు. ‘‘నిన్ను క్షమించానంటే ఆ సంగతి తెలిసి జనం ఈ గుడిని చిటికెలో సత్రంగా మార్చేస్తారు. ఆ తరవాత నాకు శాంతి అన్నది కరువై పోతుంది. నిన్ను శపించి తీరాలి. అప్పుడే మానవులకు నేనంటే భయభక్తులు ఉంటాయి. నువ్వు రైతునంటున్నావు గనక, ఒక సంవత్సరంపాటు నీ చేతి నీరు తగిలిన ప్రతి మొక్కా చచ్చిపోవాలి! ఇకనైనా ఒళ్ళు దగ్గరపెట్టుకు బుద్ధికలిగి ఉండు," అని దేవత అదృశ్యమైపోయింది. వ్యవసాయం చేసుకుని బతికే తన బోటి వాడు సంవత్సరంపాటు వ్యవసాయం చెయ్యకుండా ఎలా బతకాలా అని విచారిస్తూ నారాయణ రాజధాని చేరాడు. ఆ యేడు వసంతోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. నారాయణ వాటిని తనివి తీరాచూసి ఆనందించాడు. దేశం అన్ని మూలల నుంచీ ఉత్సవాలకు వచ్చిన వ్యవసాయదార్లు రాజుగారితో తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు. అందరికీ దాపరించిన సమస్య ఒక చిత్రమైన కలుపుమొక్క. దాన్ని ఎన్నిసార్లు పీకినా నిర్మూలం కాక, పైరులన్నిటినీ పాడుచేస్తున్నది. ఈ సంగతి విని నారాయణ రాజుగారికి నమస్కరించి, ‘‘నాకు అవకాశం ఇస్తే ఒక్క ఏడాదిలో ఈ కలుపు మొక్కలను నామరూపాలు లేకుండా సమూలంగా నిర్మూలించగలను,'' అన్నాడు. రాజు మొదట అతడి కేసి అనుమానంగా చూశాడు. అయితే, ఆ తరవాత, అతని శక్తిని పరీక్షించి, అతనికి అలాటి శక్తి ఉన్నట్టు రూఢి చేసుకుని, అతనికి కావలసిన పరివారాన్ని ఇచ్చి, అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. నారాయణ తన పరివారంతో అన్ని గ్రామాలకూ వెళ్ళి, పైరు నాటేముందుగా పొలాలన్నిటికీ తన చేతిమీదుగా నీరు పెట్టాడు. దాంతో చేలో ఉన్న కలుపు మొక్కలన్నీ పూర్తిగా నశించిపోయాయి. ఈ విధంగా దేశాటన చేయాలి; రాజభోజనం తినాలి అన్న నారాయణ కోరికలు నెరవేరాయి. అతను ఒక్క ఏడాదిలో దేశమంతా పర్యటించి, గొప్ప సత్కారాలు పొందాడు. రాజుగారు అతనికి నూరు ఎకరాల భూమి ఇనాముగా ఇచ్చాడు. మరుసటి సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు రాజధానికి పోతూ, చండముఖి ఆలయం దగ్గిరికి వచ్చేసరికి చీకటి పడటం చేత, ఆ ఆలయంలోనే విశ్రమించాడు. ఒక రాత్రివేళ దేవత ప్రత్యక్షమయింది. నారాయణ ఆమెకు నమస్కరించి, ‘‘తల్లీ, నీ శాపం వల్ల ఎంతో లోకోపకారం జరగటమేకాక, నా కోరికలన్నీ తీరాయి. దేశాటన చేసి, రాజభోజనం తిన్నాను,'' అన్నాడు. చండముఖి కళ్ళ నిప్పులు రాల్చుతూ, ‘‘మూర్ఖుడా, మళ్ళీ నన్ను కవ్వించటానికి వచ్చావా? ఈ సంవత్సరం నువ్వు నడిచిన మేర నిలువులోతు గొయ్యి పడుతుంది. నీకు ఎవరైనా పెట్టితేతప్ప తిండి ఉండదు. ఇదే నా శాపం,'' అని అంతర్థానమయింది. తాను కదలటానికి లేదని గ్రహించి, నారాయణ తెల్లవారినదాకా ఆ గుడిలోనే కూర్చుని, ఒక ఉపాయం ఆలోచించాడు. తెల్లవారగానే, ఆ దారినపోయే మనిషితో రాజుగారికి కబురుచేసి, ఒక పల్లకీ తెప్పించుకుని, అందులో వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని, తన శాపం గురించి వివరంగా చెప్పి, దానివల్ల లాభం పొందే ఒక పథకాన్ని రాజుగారికి సూచించాడు. అదేమంటే, రాజ్యంలో తవ్వవలసిన పంటకాలవలన్నీ ముగ్గులతో గుర్తుపెడితే, నారాయణ వాటి వెంట నడుచుకుంటూ పోతాడు. అతని వెనకనే నిలువులోతు కాలవలు వాటంతట అవే ఏర్పడతాయి. ఈ పథకం అమలుజరిగింది. నారాయణ కాలువల కోసం నడవనప్పుడు పల్లకీలో ప్రయాణం చేశాడు. అతను ఎక్కడ ఉన్నా రాజభోజనం బంగారు పాత్రలలో అతను ఉన్నచోటికి వచ్చింది. ఈ విధంగా నారాయణకు దేవత ఇచ్చిన రెండోశాపం వల్ల దేశానికి మరింత మేలు జరిగింది. ప్రయాస లేకుండా, అతి స్వల్పఖర్చుతో దేశమంతటా పంటకాలువలు ఏర్పడి, ఎంతో కొత్తభూమి సాగులోకి వచ్చింది. మూడోసంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు బయలుదేరి వెళుతూ, మళ్ళీ చండముఖి ఆలయంలోనే చీకటిపడే వేళకు చేరాడు. ఒక ఝాముపొద్దు పోయేసరికి దేవత వచ్చింది. నారాయణ చేతులు జోడించి ఆమెతో, ‘‘తల్లీ, నీ శాపాలు అమోఘం! నీ శాపంవల్ల మరొకసారి నాకు దేశాటనా, రాజభోజనమూ, లోకోపకారం చేసిన పుణ్యమూ లభించాయి. నువ్వు దయ ఉంచి ఇక మీదటనైనా శాపాలియ్యటం మానితే, ఇటుగా వెళుతూ రాత్రివేళ ఈ అడవిలో చిక్కుకుపోయిన మనుషులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. నీకు నిత్యమూ పూజలు జరిగేటట్టు ఏర్పాటు చేస్తాను,'' అన్నాడు. చండముఖి పట్టరాని కోపంతో, ‘‘మూర్ఖుడా, ఇప్పటికి రెండుసార్లు నా ఆజ్ఞ ధిక్కరించి నా గుడిలో ప్రవేశించావు. నా శాపాలను అవహేళన చేశావు. ఈసారి నీ దేశాటనా, లోకోపకారమూ ఎలా సాగుతాయో నేను చూస్తాను. నీ దృష్టిలో పడిన ఏ వస్తువైనా మరుక్షణమే భగ్గున మండి మసి అయిపోతుంది. నువ్వు బతికున్నన్నాళ్ళూ కళ్ళకు గంతలు కట్టుకుని, గుడ్డివాడిలా జీవించవలసిందే!'' అని శపించింది. నారాయణ చప్పున పై పంచ తీసి కళ్ళకు అడ్డంగా తలపాగా చుట్టుకుని, ఆ రాత్రంతా ఆలోచించి, తెల్లవారినాక తడుముకుంటూ గుడి బయటికి వచ్చి, తలపాగా విప్పి, ఒకసారి గుడికేసి చూశాడు. మరుక్షణం గుడి భగ్గున మండి బూడిదకుప్ప అయిపోయింది. దానితోనే నారాయణ శాపంకూడా పోయింది. తరవాత నారాయణ అక్కడ ఒక సత్రం కట్టించాడు. అది ప్రయాణీకులకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది.

సేకరణ.. ప్రాంజలి ప్రభ
*****
ప్రాంజలి ప్రాభ కథలు

*మాగాయ ఆవకాయ మధ్య గల భేదము ఏమిటని అడిగారు*. ఇలా చెప్పా రు*

మాగాయ:-

భార్యా బిడ్డలు భవబంధాలు అన్నీ త్యజించిన విరాగిలా లోపలి టెంకను, బయటి తొక్కనూ "తొక్కలే" అని వదిలించుకుని....

అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకుని లాగా ఆరుబయటకో డాబా మీదకో పోయి...

పంచాగ్నుల మధ్య తపస్సును చేసిన మునిలా సూర్యాగ్నిలో ఎండి...

సిద్ధిని పొందిన ఋషిలా  ముక్కలు  ఎండి స్థిరత్వాన్ని పొందాక...

బయటకు నిర్లేపుడు, నిర్మోహుడులా కనిపించినా అంతరాంతరాలలో మాత్రం 
నరుల పట్ల  కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధూతలా...
బయటకు ఎండిపోయి రంగుమారి గట్టిగా ఒరుగై పోయినా లోపల మాత్రం మామిడికాయ రుచినంతా దాచుకుని...

అరిషడ్వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన యతిలా,  తను విడిచి వెళ్లిన ఊటలోకి మళ్ళీ తానే దూకి,

మఠం పెట్టిన స్వామీజీ శిష్య గణాన్ని, భక్త జనులనూ కలుపుకున్నట్లు
ఉప్పూ కారం మెంతిపిండీ, ఆవపిండి తదితరాలను కలుపుకుని...

ఆ స్వామీజీ ప్రవచనాలు, మంత్రోపదేశాలూ, శక్తిపాతాలూ లాంటి   విశేషాలతో విరాజిల్లినట్లుగానే...
నూనె, ఇంగువ, కరివేపాకు వంటి తిరగమోత విశేషాలతో తానూ గుబాళిస్తూ...

'మానవసేవే మాధవసేవ' అని మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిది మాగాయ!

*****************************************************
ఆవకాయ:-

"సాధన చేయటానికి ఆలుబిడ్డలను త్యజించక్కరలేదు, వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తా" అనుకునే వివాహితునిలా...తొక్క  టెంకె ఏవీ త్యజించకుండా.. పైగా వాటినీ తనతో పాటు పచ్చడి మార్గంలో ప్రవేశపెట్టి,

"సిద్ధిని పొందటానికి ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు" అనుకుని పూజా మందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థులా...
ఇంట్లో నీడ పట్టునే ఉండి, ఉన్న బేసిన్లోనే ఉప్పూ కారం, నూనె, ఆవపిండి , మెంతిపిండి కలుపుకుని,

బంధు మిత్ర పరివార గణాన్ని కలుపుకుపోతూ వారి సహకారం తాను అందుకుంటూ, వారికీ తన సద్గుణాలు  నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకు పోయే సద్వ్యక్తిలా...
తనతోపాటు  శనగలు, వెల్లుల్లి వంటి వాటినీ కలుపుకుని, వాటికి తన రుచినీ తనకు వాటి రుచినీ ఆపాదించుకుంటూ ...

"నేను నేనుగానే ఉండి,   ఉన్నచోట నుండే సాధన చేసి మానవసేవా, మాధవసేవ రెండూ చేయగలను"  అని....
చతుర్విధ పురుషార్థాలనూ గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిది ఆవకాయ.
*****
*ప్రాంజలి ప్రభ కథలు

రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది.* 
ఆమె పిల్లలు పడుకున్నారు. భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు. చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు.
"ఏమైంది?
ఎందుకు ఏడుస్తున్నావు?
ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.
నిన్న నా సెకండ్ క్లాస్ విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని.
"అయితే?"
"ఇదిగో! ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు."
భర్త ఆసక్తిగా "అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"
హెడ్డింగ్ ఇలా పెట్టాడు
*నేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక.*
అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్ ను చాలా ప్రేమిస్తారు. వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా, శ్రద్ధగా, ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా. నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు. ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు.
అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు. కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు. నేను ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు. వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు. వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు. అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే, అదే ఒకవేళ నాతో  మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ కి జవాబిస్తారు. అమ్మానాన్నలు
స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు. ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు. దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. దాన్ని చాలా ఇష్టపడుతారు. దానితో రిలాక్స్ అవుతుంటారు. దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు. దానిని ఎపుడు పనివాళ్ళకి అప్పగించరు. నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు కానీ స్మార్ట్ ఫోన్ ఒక్కగంట పనిచేయకపోతే చాలా కంగారుపడతారు. హడావిడి చేస్తారు. రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు. ఉదయం లేవగానే దాన్నే  చేతిలోకి తీసుకుంటారు. కాబట్టి! నా కోరిక ఏమిటంటే నేను అమ్మా నాన్న  చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను.
భార్య చదువుతుంటే విన్న  భర్తకు మనసంతా పిండేసినట్లైంది. అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా
"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.
*"మన కొడుకు"* అంది భార్య కన్నీరు కారుతుండగా.
వస్తువులను ఉపయోగించుకోవాలి.
బంధాలను ప్రేమించాలి.
అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి.
*****
ప్రాంజలి ప్రభ కథలు

శ్రీరామునిలో ఉన్న 16 గుణాలు.. మీకు తెలుసా?

దశరథ రాముడు.. కోదండ రాముడు.. జానకీ రాముడు.. ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మహాకావ్యం 'శ్రీరామాయణం'. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది.

మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు? అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు 'పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి' అని నిర్ధారించాడు. మనుష్య జీవితంతో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు.. మానవుడిగా పెరిగాడు.. మానవుడు
పడిన కష్టాలను పడ్డాడు. మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యముతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, శుశ్రూషలతో గురువులను, దాన గుణముతో దీనులను గెలిచాడు. అలాగే, తన పౌరుష పరాక్రమములతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం.

కోన్ అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః | విద్వాన్ కః కః సమర్థశ్చ కః ఏక ప్రియదర్శనః ॥

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః | కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥

ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు. అవే.. 1. గుణవంతుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మాత్ముడు, 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7. చారిత్రము కలిగినవాడు, 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, 9. విద్యావంతుడు, 10. సమర్థుడు, 11. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, 12. ధైర్యవంతుడు, 13. క్రోధాన్ని జయించినవాడు, 14. తేజస్సు కలిగినవాడు, 15. ఎదుటివారిలో మంచిని చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు.
*****